నారాయణరావుపేట, ఏప్రిల్ 2 :నాడు కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేట నేడు కల్పతరువుగా మారిందని, సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంతోనే అది సాధ్యమైందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీశ్రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, కేసీఆర్ సీఎం కావడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందని, నాడు మన ప్రాతం కరువుతో అల్లాడిపోయిందని, నేడు మండుటెండల్లో ప్రతి పల్లె చెరువు, కుంట, చెక్డ్యాంలు నిండి మత్తళ్లు దుంకుతూ, తొలిసారి యాసంగి పంటకు నీళ్లు ఇచ్చి రైతుల్లో ఆనందం నింపామన్నారు. నిరంతరం విద్యుత్ ఇస్తూ సాగునీరు ఇస్తున్న మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసామన్నారు. మండలం ఉత్తమ మండలంగా ఆదర్శంగా నిలువాలని, అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఇప్పటికే ఇబ్రహీంపూర్, గుర్రాలగొందితో పాటు ఇటీవలే మల్యాల గ్రామం జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాయన్నారు. ఇదే స్ఫూర్తితో గ్రామాలు ఆదర్శంగా నిలిచి మండలానికి జాతీయ స్థాయిలో అవార్డు సాధించాలన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామంలో 50ఎకరాల్లో తెలంగాణ సోనా ఉత్పత్తి కేంద్రంగా చేసుకోబోతున్నామని, కోవా తయారీ కేంద్రంగా జక్కాపూర్ గ్రామం ఆదర్శంగా నిలువాలన్నారు. మహిళా సంఘాలకు మరింత చేయూతనిచ్చేలా కోవా కేంద్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని సూచించారు. ప్రతి పల్లెలో పూర్తయిన డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలను వినియోగంలోకి తేవాలన్నారు. ఓపెన్ జిమ్స్, పల్లె ప్రకృతి వనాలు, గ్రామాల్లో రోడ్లు, భవనాలు, కమ్యూనిటీ హాళ్ల పనులు నెలాఖరులోగా పూర్తి కావాలని చెప్పారు.
కరోనా తీవ్రత నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాలని, మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. 45ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని తెలియజెప్పాలన్నారు. గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ పనులను వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి హరీశ్రావు సూచించారు.
ఇవీ కూడా చదవండి..
భారత్ నుంచి పత్తి దిగుమతికి పాకిస్థాన్ గ్రీన్సిగ్నల్
ప్రపంచంలో తొలిసారి.. జంతువులకు కోవిడ్ టీకా ఇవ్వనున్న రష్యా
బ్రెజిల్లో రాజకీయ సంక్షోభం.. త్రివిధ దళాధిపతులు రాజీనామా
ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండేవారికి కుచించుకుపోనున్న గుండె.. వ్యోమగాములపై పరిశోధన