అహ్మదాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఎనిమిదేండ్ల బాలుడ్ని తల్లి, ఆమె బావ కలిసి హత్య చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్ గ్రామీణ ప్రాంతమైన విరామ్గంలో రెండేండ్ల కిందట ఈ దారుణం జరుగగా వారిద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జోస్నా పటేల్, జగదీశ్ పటేల్ దంపతులకు ఎనిమిదేండ్ల కుమారుడు హార్దిక్ పటేల్ ఉన్నాడు. కాగా, జోస్నా ఆమె బావ రమేశ్ పటేల్ మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి హార్దిక్ పటేల్కు తెలిసింది. దీంతో భర్తకు ఈ విషయాన్ని చెబుతాడన్న భయంతో జోస్నా, రమేశ్ కలిసి అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. 2018 సెప్టెంబర్ 28న వారిద్దరు హార్దిక్ను జలంపుర గ్రామంలోని పొలంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని తగులబెట్టి గోతిలో పూడ్చారు. కొన్ని రోజుల తర్వాత రమేశ్ తిరిగి పొలానికి వెళ్లాడు. ఆధారాలను నాశనం చేసేందుకు పూడ్చిన ప్రాంతాన్ని తవ్వి బాలుడి మృతదేహాం అవశేషాలను మురికికాలువలో పడేశాడు.
మరోవైపు స్వీట్లు కొనేందుకు వెళ్లిన హార్దిక్ ఇంటికి తిరిగి రాలేదని, అతడ్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు విరామ్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 సెప్టెంబర్లో నమోదైన బాలుడి మిస్సింగ్ కేసును విరామ్గం పోలీసులు రెండేండ్ల తర్వాత చేధించారు. బాలుడి కుటుంబ సభ్యులు, జలంపుర గ్రామస్తులను పోలీసులు అన్ని కోణాల్లో ప్రశ్నించారు. బాలుడు కనిపించకుండా పోయిన సమయంలో జోస్నా, రమేశ్ జలంపురలోని ఒకే ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. హార్దిక్ మిస్సింగ్పై వారిద్దరూ పొంతన లేని సమాధానాలు చెప్పి దొరికిపోయారు. దీంతో జోస్నా, రమేశ్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారిపై హత్య, ఆధారాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.