నిర్మానుష్యంగా రహదారులు
పర్యవేక్షించిన ఉన్నతాధికారులు
లక్ష్మణచాంద, మే 15 : లక్ష్మణచాంద గ్రామపంచాయతీలో స్వచ్ఛంద లాక్డౌన్.. సత్ఫలితాలిస్తున్నది. పంచాయతీ తీసుకున్న చర్యల ఫలితంగా కరోనా తగ్గుముఖం పట్టింది. త్వరలో కొవిడ్ కేసులు లేని గ్రామంగా మారనున్నది. ఏప్రిల్లో రోజుకు 7 నుంచి 15 కేసులు రాగా, సర్పంచ్ సురకంటి ముత్యంరెడ్డి, వీడీసీ చేసిన కృషి ఫలిస్తున్నది.
మండలకేంద్రానికి ప్రతి రోజూ అన్ని గ్రామాల నుంచి ప్రజలు వస్తూపోతుండడంతో గతనెలలో 70కిపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సర్పంచ్, వీడీసీ సభ్యులు 15 రోజుల కిత్రం గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించి, కఠినంగా అమలు చేశారు. ప్రతి రోజూ సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. వైద్య సిబ్బంది నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
దీంతో గ్రామస్తులు భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత కార్యక్రమాలపై దృష్టిపెట్టడంతో కరోనాను కట్టడి చేయగలిగారు. ఒక వైపు నిర్ధారణ పరీక్షలు చేస్తూనే, మరోవైపు వ్యాక్సిన్ వేసుకునేలా వైద్య సిబ్బంది ప్రోత్సహించారు. గ్రామంలో 1550 మంది 45 ఏండ్లు నిండినవారు ఉండగా, ఇప్పటికే 1425 మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. వైరస్పై భయం కంటే అవగాహన కల్పిస్తుండడంతో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 92 కేసులు నమోదైనట్లు ఆరోగ్య సహాయకురాలు సుగుణ తెలిపారు. పంచాయతీతో పాటు ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలతో రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.
బయటకు వెళ్లడం తగ్గించాం..
ఇక్కడ కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతో 15 రోజుల క్రితం స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. ఇంట్ల నుంచి బయటకు రావద్దని, లేకపోతే జరిమానా విధిస్తామని పంచాయతీ తీర్మానం చేసింది. దీంతో అనవసరంగా బయటకు రావడం తగ్గిపోయింది. మాస్కు పెట్టుకుంటున్నాం. శానిటైజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కేసులు తగ్గుతున్నాయన్న వార్త ఆనందం కలిగిస్తున్నది.
అవగాహన పెంచుతున్నాం..
కరోనా వైరస్పై, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా స హకరిస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే 90 శాతం అర్హులు వ్యాక్సిన్ వేసుకున్నారు. దాని ప్రభావంతో కేసుల్లో తగ్గుదల వస్తున్నది. త్వరలో లక్ష్మణచాంద, తిర్పెల్లి గ్రామలు కరోనా రహిత గ్రామాలుగా మారుతాయి.