అత్యవసర సేవలకు మినహాయింపు
మార్గదర్శకాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ విష్ణు.ఎస్ వారియర్
ఖమ్మం, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం రాత్రి సమయంలో విధించిన కర్ఫ్యూను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఖమ్మం కలెక్టర్ ఆర్వీకర్ణన్, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు.ఎస్.వారియర్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఒక ప్రకటన విడుదలచేశారు. సీపీ జిల్లాలో శాంతి భద్రతలు, కర్ఫ్యూ అమలుపై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నామన్నారు. మంగళవారం నుంచి రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. అత్యవసర సేవలు, అత్యవసర పనులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. అవసరం లేకున్నా కర్ఫ్యూ సమయంలో సంచరించేవారిని, మార్గదర్శకాలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటలలోపే అన్ని రకాల వ్యాపార వాణిజ్య సంస్థలు, షాపింగ్మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, వైన్స్, బార్, రెస్టారెంట్లు మూసివేయాలని కోరారు.
ప్రభుత్వం అత్యవసర సర్వీసులు, వ్యాపార వాణిజ్య సంస్థలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని, వాటికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉందన్నారు. రాష్ట్ర, అంతరాష్ట్ర రవాణా సర్వీసులు, ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తాయన్నారు. బస్స్టేషన్, రైల్వేస్టేషన్ నుంచి వెళ్లొచ్చేవారు కర్ఫ్యూ సమయంలో ఆధారాలు చూపించాలన్నారు. అత్యవసర సేవలు అందించేవారు పోలీసులకు విధిగా తమ గుర్తింపు కార్డులు చూపించాలని సీపీ సూచించారు. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్, ల్యాబ్లు, పార్మసీలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు అందించేవారికి, ప్రసార, కేబుల్, ఐటీ సేవలు, ఇ-కామర్స్ ద్వారా వస్తువులు పంపిణీ చేసేవారికి, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్ లైట్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, కోల్డ్ స్టోరేజీ, గిడ్డంగి, ప్రైవేట్ భద్రతా సేవలు, అత్యవసర సర్వీసులుగా భావించి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్నారు. సరుకు రవాణా చేసే వాహనాలు యథావిధిగా సేవలు అందించవచ్చునని పేర్కొన్నారు.
ఈ నెలాఖరు వరకూ..
ఖమ్మం, ఏప్రిల్ 20 : కొవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం రాత్రి వేళలో కర్ఫ్యూ విధించిందని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ. కర్ణన్ తెలిపారు. ఈ నెల 30న తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలు గమనించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలన్నారు.
కర్ఫ్యూకు సహకరించాలి…
భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్దత్
కొత్తగూడెం, ఏప్రిల్ 20 : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ నిర్వహించనున్నట్లు ఎస్పీ సునీల్దత్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని, పెట్రోల్ బంకులు, మీడియాకు మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి కరోనా వైరస్ కట్టడిలో పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.