రంగారెడ్డి, ఏప్రిల్ 10, (నమస్తే తెలంగాణ): జిల్లాలో వ్యాక్సినేషన్కు డిమాండ్ పెరిగింది. ఇంతకుముందు వ్యాక్సిన్ వద్దనుకున్న వాళ్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పుడు టీకా కోసం ప్రభుత్వాసుపత్రులకు క్యూ కడుతున్నారు. గత నెలాఖరులో రోజుకు 2 వేల మంది వ్యాక్సిన్ తీసుకోగా… ప్రస్తుతం ఆ సంఖ్య నాలుగింతలవటం గమనార్హం. గత వారం రోజులుగా జిల్లా అంతటా కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో వ్యాక్సినేషన్కు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లోనూ ఉదయం నుంచే బారులుతీరుతున్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్తోపాటు 45 ఏండ్లకుపైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న విస్తృత అవగాహన కూడా ఫలిస్తున్నది.
ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి నాలుగు రోజులపాటు టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో వ్యాక్సిన్ వేయించుకోని ఫ్రంట్లైన్ వారియర్స్తోపాటు ప్రజాప్రతినిధులకు (జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు) వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వీరితోపాటు గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న వీవోలు, సీసీలు, ఏపీఎంలకు కూడా టీకా వేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సరిపోను వ్యాక్సిన్ను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రోజుకు 10 వేల మందికి వ్యాక్సినేషన్ చేస్తుండగా ఈ నెల 14 వరకు వరకు రోజుకు సుమారు 20 వేల వరకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అంతా సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న జిల్లాలోని 40 ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి సెలవులు లేకుండా పూర్తిస్థాయిలో హాజరయ్యేందుకుగాను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లోనే క్యాంపు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించేందుకుగాను అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్తోపాటు అన్ని శాఖల కార్యాలయాలతోపాటు అన్ని మండలాల రెవెన్యూ ఇతర శాఖల కార్యాలయాల్లో క్యాంపులు నిర్వహించి అక్కడే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి జిల్లా వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు వచ్చిన వెంటనే క్యాంపు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
కొనసాగుతున్న ఇంటింటి సర్వే..
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకుగాను వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 60 ఏండ్లు దాటిన వారికి, 45 ఏండ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వగా, ఈ నెల 1వ తేదీ నుంచి 45 ఏండ్లకుపైబడిన వారికి కూడా కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో ఇంటింటీ సర్వే నిర్వహిస్తున్నారు. 45 ఏండ్లు పైబడిన వారి వివరాలను సేకరిస్తూనే వ్యాక్సిన్ వేసుకోవాలని వారికి ఆశ వర్కర్లు సూచిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సర్వేలో భాగంగా 32 వేల మంది వివరాలను సేకరించారు. వ్యాక్సిన్పై అపోహలు వీడేలా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చేపట్టిన విస్తృత ప్రచారం చాలామంది టీకా వేసుకునేందుకు ముందుకు వచ్చేలా చేసింది. అయితే గత వారం రోజులుగా కరోనా కేసులు 200లకుపైగా కేసులు నమోదవుతుండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జ్వరం తదితర లక్షణాలున్న ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. కరోనా పరీక్షలను వీలైనంత ఎక్కువ పెంచేందుకు చర్యలు చేపట్టారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వారి కాంటాక్ట్స్ను గుర్తించి వారికి పరీక్షలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, ఏప్రిల్ 10 : జిల్లా వ్యాప్తంగా తాండూరులోని జిల్లా దవాఖాన, పరిగి, వికారాబాద్, కొడంగల్, మోమిన్పేట్లలోని క్లస్టర్ ఆసుపత్రులు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా ప్రభుత్వం టీకాలు వేస్తున్నది. వికారాబాద్లోని మహావీర్ ప్రైవేటు దవాఖానలో నగుదు చెల్లిస్తే టీకా వేస్తున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నాలుగు మున్సిపాలిటీలలో మొత్తం సిబ్బంది 827 మందికి కొవిడ్ టీకా వేయడానికి ఏర్పాట్లు చేశారు. గతంలో 62 మంది టీకాలు వేయించుకోగా మిగతా వారికి శనివారం, ఆదివారం రెండు రోజుల్లో టీకాలు వేయడం పూర్తి చేయనున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు.
ఇందులో మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, ఇతర సిబ్బంది ఉన్నారు. టీకా ఉత్సవ్లో భాగంగా ఫ్రంట్లైన్ వర్కర్స్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బందికి టీకా వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో వారు 2268 మంది ఉండగా 405 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వార్డుసభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు మొత్తం 1787 మంది ఉండగా 233 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మండల పరిషత్ సిబ్బంది 48 మందికిగాను 24 మంది, ఉపాధిహామీ సిబ్బంది 12 మందికి 12 మంది, సెర్ప్ సిబ్బంది 51 మందికి 10 మంది, గ్రామసంఘాల సహాయకులు 111 మందికి 10 మంది టీకాలు వేసుకున్నారు. రెండవ కేటగిరిలో ఉన్న వీరిలో 45 ఏండ్లు పైబడిన వారికే కొవిద్ టీకా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు కేటగిరిలు కలిపి మొత్తం 5104 మంది ఉండగా ఇప్పటివరకు 756 మంది టీకాలు వేసుకున్నారని తెలిపారు. మిగతా వారికి టీకా ఉత్సవ్లో టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు.
45 ఏండ్లు పైబడిన వారంతా టీకా వేయించుకోవాలి
జిల్లా పరిధిలోని 45 ఏండ్లు పైబడిన వారందరు తప్పనిసరిగా కొవిడ్ టీకా వేసుకోవాలి. జిల్లాలో 27 ప్రభుత్వ, ఒక ప్రైవేటు కేంద్రంలో కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతున్నది. తప్పనిసరిగా తమ సమీప టీకా కేంద్రంలో అర్హులందరూ టీకా వేసుకోవాలి. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి.