సేవ్ ద పీపుల్..
సేవ్ ద విలేజెస్..
సేవ్ యువర్సెల్ఫ్..
మీకు పదే పదే చెప్పవలసి వస్తున్నది. మీకు కావలసినంత సమయం ఇచ్చిన తర్వాతనే నేను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించాను. దానికి ముందు మరోసారి మీతో మాట్లాడి మీ అభిప్రాయాలను కూడా తీసుకుందామని నేటి సమావేశాన్ని ఏర్పాటుచేశాను. చెప్పకపోతే నాది తప్పు. ఇంత చెప్పినంక కూడా ఇంకా ఎవరైనా పనితీరును మెరుగుపరుచుకోకుండా, తప్పులను సరిదిద్దుకోకుండా, అలసత్వం వహించి, నిర్దేశిత బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించినట్టు నా తనిఖీల సందర్భంగా నిరూపణ అయితే ఇక ఎవరు చెప్పినా వినను. క్షమించే ప్రసక్తే లేదు. తక్షణమే కఠిన చర్యలుంటాయి.
పల్లెల్లో పట్టణాల్లో అభివృద్ధి విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రంగా హెచ్చరించారు. ఆరునెలలపాటు ఒక యజ్ఞంలా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని, అధికారులు రాత్రుళ్లు గ్రామాల్లో బసచేయాలని ఆదేశించారు. అధికారులు పనితీరును చక్కదిద్దుకోకపోతే కఠిన చర్యలు తీసుకొంటానని, ఎవరు చెప్పినా వినేదిలేదని స్పష్టంగా చెప్పారు. అధికారులు మూస ధోరణులు మానుకొని, సామర్థ్యాన్ని పెంచుకొని పట్టుదలతో కృషిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని, వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో అద్భుతమైన దవాఖానను నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధి సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఒక జిల్లాను దత్తత తీసుకొని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానని ప్రకటించారు. పల్లెలు, పట్టణాలను ప్రగతిపథంలో నడిపించేందుకు అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ, మున్సిపల్ అధికారులు కంకణబద్దులు కావాలని.. ఒక యజ్ఞంలా భావించి పనిచేయాలని పిలుపునిచ్చారు. పనితీరును చక్కదిద్దుకోకపోతే ఉపేక్షించబోమని, ఎవరు ఎన్ని చెప్పినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు, మొక్కల పెంపకం పురోగతిని పరిశీలిస్తానని చెప్పారు. జూన్ 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అకస్మిక తనిఖీలు చేయనున్నట్టు ప్రకటించారు. 21న వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, పాతజైలు స్థలంలో నిర్మించతలపెట్టిన సూపర్స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. స్థానిక సంస్థలకు ఎమర్జెన్సీ నిధుల కింద ప్రతి జిల్లా అడిషనల్ కలెక్టర్కు రూ.25 లక్షలు తక్షణమే కేటాయించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్లో అన్నిజిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీరాజ్ అధికారుల (డీపీవో)తో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అంశాలవారీగా ఏ ఏ జిల్లాలు తమ లక్ష్యాలను ఎలా చేరుకున్నదనేదానిపై సుదీర్ఘంగా సమీక్షించారు.
తమకోసం పనిచేసే ఆదర్శవంతమైన కలెక్టర్లను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సీఎం కేసీఆర్ ఉదాహరణలతో సహా వివరించారు. గతంలో ఆదర్శంగా పనిచేసిన కలెక్టర్ల పేర్లను ఉదహరించారు. గ్రామసభలు నిర్వహించి, గ్రామ ఆర్థిక నివేదికలపై చర్చలు చేపట్టేలా చూడాల్సిన బాధ్యత డీపీవోలదేనని స్పష్టంచేశారు. పంచాయతీ ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, ట్రాక్టర్ కిస్తీల చెల్లింపు, గ్రీన్ కవరేజీ కోసం ఖర్చు తదితర అంశాలు చార్జ్డ్ అకౌంట్ కిందికి వస్తాయని.. వీటికి ముందుగా నిధులు కేటాయించాకే మిగలిన చెల్లింపులు చేయాలని తెలిపారు. పల్లెప్రకృతి వనాలకోసం ప్రభుత్వభూమి లేనిపక్షంలో గ్రామనిధుల నుంచి ప్రయివేట్ భూమిని కొనుగోలు చేయాలని సూచించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎస్ కే డే మార్గదర్శకత్వంలో ఒక ఉద్యమంలా రూపుదిద్దుకొన్న కమ్యూనిటీ డెవలప్మెంట్ (సీడీ) కార్యక్రమం, ఆ తర్వాత క్రమంలో పంచాయతీరాజ్ ఉద్యమంగా ప్రారంభమైందని, అదే తరహాలో సహకార ఉద్యమం కూడా పురుడుపోసుకొన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. కానీ, రాను రాను పంచాయతీరాజ్ వ్యవస్థను రాజకీయంచేసి, అకడితో ఆగకుండా డిపార్మెంటలైజ్ చేసి.. దానిని కంపార్ట్మెంటలైజ్చేసి ఎస్ కే డే కలలుగన్న స్ఫూర్తిని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో ఇప్పటికే ఆదర్శవంతంగా రూపుదిద్దుకుంటూ ప్రగతిపథంలో సాగిపోతున్న పంచాయతీరాజ్ వ్యవస్థను ఎస్కేడే ఆశయాలకు అనుగుణంగా మరింత గొప్పగా తీర్చిదిద్దే బాధ్యతను యువ అదనపు కలెక్టర్లు భుజాలమీదికెత్తుకోవాని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతిపథంలో డీపీవోలను తమవెంట నడిపించుకుపోవాలని అదనపు కలెక్టర్లకు సూచించారు.
అధికారులు నిర్భీతిగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని.. ఎవరో ఒత్తిడి చేస్తున్నారనే మాట వినపడకూడదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.‘మీపని మీరు సమర్థంగా చేయండి. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీవెంట సీఎం కేసీఆర్ ఉన్నాడనే ధైర్యంతో పనిచేయండి’ అని ధైర్యం చెప్పారు. ‘అసాధ్యమనేదేదీ ఉండదు. గట్టిగా తలుచుకోవాలె. మనకు పల్లెలు, పట్టణాల అభివృద్ధిని మించిన మరోపనిలేదు, అవసరమైతే మీరు పల్లెల్లో పర్యటనలు చేపట్టాలె, రాత్రిళ్లు బసచేసి పొద్దున లేచి జనంలో తిరుగాలె. అప్పుడు మాత్రమే మనకు క్షేత్రస్థాయి కష్టాలు అర్థమవుతాయి, వాటికి పరిషారాలను మీరు కనుగొనగలుగుతారు. మీరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విసృ్తతంగా పర్యటించడానికి నూతన వాహనాలను ఇప్పటికే సిద్ధంచేసి ఉంచాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం నెలనెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నాం. పంచాయితీరాజ్ వ్యవస్థలో ఒకపోస్టు కూడా గంటపాటుకూడా ఖాళీలేకుండా చూద్దాం. ఆర్థిక వనరులున్నాయి, ఉద్యోగవ్యవస్థ ఉన్నది, ప్రభుత్వం అన్నిరకాలుగా అండదండగా నిలుస్తున్నది. ఇంకా ఏమి కావాలె? ఏ ప్రభుత్వమైనా ఇంతకన్నా ఎకువగా ఏం చేయగలుగుతుంది? కాబట్టి, మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ చర్యలకు గురికావద్దు’ అని స్పష్టంచేశారు. పర్సనల్ అప్రైజల్ రిపోర్ట్ను (పీఏఆర్) తయారుచేయడం ద్వారా కలెక్టర్ల పనితీరును రికార్డుచేస్తామని చెప్పారు. పంచాయితీ కార్యదర్శి పోస్టు ఎక్కడా ఖాళీగా ఉండకుండా తక్షణమే నింపుకొనే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఎంపీడీవోలకు ఓరియెంటేషన్ కోసం క్లాసులు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ ఏర్పాటైన అనతికాలంలోనే దేశం గర్వించదగ్గస్థాయిలో అనేక రకాలుగా గ్రామీణ, పట్టణాభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను అమలుపరుస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని సీఎం తెలిపారు. ఏదో సాధించామని తృప్తి పడి, అకడితే ఆగిపోవడం సరికాదని పేరొన్నారు. కలెక్టర్ అనే పదాన్ని పదేపదే చట్టంలో రూపొందించింది అదనపు కలెక్టర్ల దృష్టిలో ఉంచుకొనే అని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చాంబర్ పకనే అదనపు కలెక్టర్లకు చాంబర్ను ఏర్పాటుచేసి వారికి ప్రొటోకాల్ గౌరవాన్నిమరింత పెంచుతామని పేర్కొన్నారు. ‘పని ఎత్తుకుంటే ఏదో చేసినమంటే చేసినం అన్నట్టుగా డ్రై గా చేయకూడదు. మనసు పెట్టి రసాత్మక హృదయంతో పనిలో లీనమై చేయాలి’ అని సూచించారు. అప్పుడే సరైన ఫలితాలను రాబట్టగలమని స్పష్టంచేశారు.
సమీక్షా సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాలవారీగా, అంశాలవారీగా ప్రగతి పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంచాయితీరాజ్ కార్యదర్శి, అన్ని జిల్లాల్లో అంశాలవారీగా పురోగతిని చదివి వినిపించారు. వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, డంపుయార్డులు సహా ఇతర నిర్మాణాలను పేరు పేరునా అడిగి తెలుసుకొన్నారు. ట్రాక్టర్లు కొన్నారా? కిస్తీలు చెల్లిస్తున్నారా? కరెంట్ బిల్లులు కడుతున్నారా? పారిశుద్ధ్యం, చెత్తసేకరణ, పచ్చదనం, మంచినీటి సరఫరా, మొకల స్థితి ఏ జిల్లాలలో ఎలా ఉన్నది అడిగి తెలుసుకున్నారు. మొకలు బతికిన శాతం, గ్రామసభలు నిర్వహించిన తీరు, స్థానిక ఎంపీడీవోలు పాల్గొంటున్న తీరు, గ్రామ ప్రగతి కోసం తీసుకొన్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామసభలు నిర్వహించారు? గ్రామ ప్రగతి నివేదికల మీద జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలపై ఆరాతీశారు. చెత్తసేకరణ, డంపుయార్డులు, వైకుంఠధామాల నిర్మాణ స్థితి, బోరుబావులు పూడ్చడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, డ్రైనేజీలు శుభ్రం చేయడం వంటి అంశాలపై పేరుపేరునా వివరాలు తీసుకున్న సీఎం.. ఈ అంశాల్లో అనుకున్న రీతిలో పురోగతిని సాధించకుండా వెనుకబడిన జిల్లాల్లో తక్షణమే పూర్తిచేయాలని ఆదేశించారు.
జిల్లా, మండల పీహెచ్ స్థాయిల్లో సీజనల్ వ్యాధులను తగ్గించేందుకు శాఖల వారీగా సమన్వయం అత్యంత అవసరమని సీఎం స్పష్టంచేశారు. వ్యాధుల ముందస్తు చర్యలకోసం ఈ విధానం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ‘వ్యాధులు ప్రబలినంక మందుల డబ్బాలు చేతుల పట్టుకొని తిరిగి పరేశాన్ కాకుండా.. సీజన్ ప్రారంభం కన్నాముందే.. ఏ ఏ వ్యాధులు వ్యాపించే ప్రమాదమున్నదో చర్చించి వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వైద్యశాఖ, పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్శాఖ అధికారులు కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. అందుకు సంబంధించి ఒక చార్టును రూపొందించుకోవాలని, తద్వారా వైరల్ సీజనల్ వ్యాధులను ముందస్తుగానే అరికట్టవచ్చని సీఎం తెలిపారు. సమావేశం ముగిసేలోపల అధికారులు సీజనల్ వ్యాధుల చార్టును సభ్యులందరికీ అందించారు. కరోనాకు అందుతున్న వైద్యం, నియంత్రణ, వ్యాక్సినేషన్ గురించి వైద్యాధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. కరోనా తగ్గుముఖం పడుతుండటం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు, హై రిస్క్ గ్రూపులను గుర్తించి వ్యాక్సినేషన్ అందించడం ద్వారా గణనీయంగా కరోనా వ్యాప్తిని అరికట్టగలిగామని సమావేశం అభిప్రాయపడింది. కాగా.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇదే పద్ధతుల్లో కొనసాగిస్తూనేఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.
స్థానిక సంస్థలు రిజిస్టర్ చేసుకోవాలి పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే లేఅవుట్స్ విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లే-అవుట్లలో కమ్యూనిటీలకు కేటాయించిన కమ్యూనిటీహాల్, ట్రాన్స్ఫార్మర్స్, సబ్స్టేషన్స్, వాటర్ ట్యాంకర్ తదితరాలకు కేటాయించిన స్థలాలను కూడా లే-అవుట్ యజమానులు తర్వాత అమ్ముకుంటున్నారని, వాటినిముందే మున్సిపాలిటీల పేరు మీద రిజిస్టర్ చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణాలు ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందేలా నిబంధనలకు అనుగుణంగా లే-అవుట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.. పట్టణాలల్లో పూర్తి స్థాయిలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేయాలని, దీనివల్ల విద్యుత్తు బిల్లుల ఖర్చు తకువగా రావడం సంతోషకరమని పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి మాస్టర్ ప్లాన్లో డైనమిక్ అప్డేషన్ చేయాలని సీఎం సూచించారు. ప్రజావసరాల కోసం నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్ బ్యాంక్ ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మాజీమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు హన్మంతుషిండే, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, చిరుమర్తి లింగయ్య, పట్నం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
సర్పంచ్లు, కిందిస్థాయి ఉద్యోగులకు తెలియని విషయాలను నేర్పిస్తూ, సామర్థ్యాలను పెంచుతూ వారిని గ్రామాభివృద్ధిలో భాగస్వాములనుచేయాలని అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ సూచించారు. మొదటి దశలో సర్పంచ్లు, ఇతర సిబ్బందితో ప్రేమగా ఉండండి, మంచిగా సముదాయించి చెప్పండి అభిమానంతో పనిచేయించుకోండి. వినలేదనుకో కొంచెం కఠినంగా మారండి అని చెప్పారు. ‘నయమున ప్రాలుం దాగరు, భయమున విషమైన భుజింతురు’ అని అంటరు. అంటే.. మంచిగా నిమ్మలంగా బతిమాలి చెప్తే కూడా కొన్నిసార్లు వినరు.. అప్పుడు నరసింహావతారం ఎత్తక తప్పదు’ అని వివరించారు. గ్రామాభివృద్ధిలో కేరళ ఆదర్శంగా నిలిచిందని, కొంతమంది అదనపు కలెక్టర్లు, డీపీవోలను ఎంపికచేసి ఆ రాష్ట్ర పర్యటనకు పంపించాలని సీఎం కేసీఆర్ సీఎస్ను ఆదేశించారు. ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలు పరుస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకున్నదని.. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ అని, తెలియని విషయాలను తెలుసుకోవడానికి అహంభావం కూడదని సీఎం హితవు పలికారు.
‘పల్లెలు, పట్టణాలను అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచే క్రమంలో అదనపు కలెక్టర్లు, డీపీవోలు కష్టపడి పనిచేస్తున్నారు. అయితే, ఆశించినంత పని జరుగుతలేదని క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందుతున్నయి. అందుకే మీకు పదేపదే చెప్పాల్సి వస్తున్నది. కావల్సినంత సమయం ఇచ్చాకే ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించా. దానికిముందు మీతో మరోసారి మాట్లాడి మీ అభిప్రాయాలను కూడా తీసుకుందామని నేటి సమావేశాన్ని ఏర్పాటుచేశా. చెప్పకపోతే నాది తప్పు. ఇంత చెప్పినంక కూడా ఇంకా ఎవరైనా అదనపు కలెక్టర్లు, డీపీవోలు వారి పనితీరును మెరుగుపరుచుకోకుండా, తప్పులను సరిదిద్దుకోకుండా, అలసత్వం వహించి, నిర్దేశిత బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించినట్టు నా తనిఖీల సందర్భంగా నిరూపణ అయితే ఇక ఎవరుచెప్పినా వినను.. క్షమించే ప్రసక్తే లేదు.. తక్షణమే కఠిన చర్యలుంటాయి’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తన పర్యటనకు ఇంకా పదిరోజుల సమయం ఉన్నందున ఈలోపు ఏవైనా తప్పొప్పులుంటే సరిదిద్దుకోవాలని సూచించారు. గ్రామసభలు జరపకపోతే గ్రామ కార్యదర్శులను, సర్పంచ్లను సస్పెండ్చేయాలని, ఈ విషయంలో అధికారపార్టీ అని కూడా చూడొద్దని, టీఆర్ఎస్ సర్పంచ్లు తప్పుచేస్తే ముందు వాళ్ల మీదే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మొక్కలు నాటే పనిని ప్రారంభించిన పది పదిహేనురోజుల్లో అన్ని గ్రామాలు, పట్టణాల్లో పూర్తిచేయాలని అటవీశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో వందకు వందశాతం నర్సరీల్లో మొకల పెంపకం కార్యక్రమం జరుగుతున్నదని అధికారులు వివరించగా.. వారిని సీఎం అభినందించారు. ‘మంచిగ పనిచేసినోళ్లను గుర్తించి అవార్డులు- రివార్డ్దులు అందజేయాలని సూచించారు. వైకుంఠధామాలకు కాంపౌండ్గా గోడలను కాకుండా గ్రీన్ ఫెన్సింగ్ను ఏర్పాటుచేయాలని చెప్పారు. దట్టమైన పచ్చని పెద్దపెద్ద చెట్లతో రక్షణ ఏర్పాటుచేయాలని తెలిపారు. వైకుంఠధామాల నిర్మాణాలను నూటికినూరు శాతం పూర్తిచేయాలన్నారు. కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ నిధులే కాకుండా స్వచ్ఛంద సంస్థలు తదితర మార్గాలద్వారా నిధులను సమీకరించుకొని అత్యంత సుందరంగా వైకుంఠధామాలను తీర్చిదిద్దుకొంటున్నరనే విషయాన్ని ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత బాధ్యతను, గ్రామ సర్పంచ్ తీసుకోవాలని, మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాసంబంధ సంస్థల పారిశుద్ధ్య బాధ్యతను మున్సిపాలిటీ పాలకవర్గాలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు దాటినా పల్లెలు, పట్టణాల్లో ఆశించిన మేరకు అభివృద్ధి జరుగకపోవడంపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి మొదటినుంచి నిర్లక్ష్యానికి గురవుతుండటం శోచనీయమన్నారు. ఇందుకు అధికార యంత్రాంగం మానసిక ధోరణికూడా ప్రబల కారణమని అభిప్రాయపడ్డారు. పాత పద్ధతులను వదిలి, నిత్యనూతనంగా ప్రజాక్షేత్రంలో మమేకమై, గ్రామాభివృద్ధికోసం తమకు అందివచ్చిన గొప్ప అవకాశాన్ని యువ కలెక్టర్లు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మూసధోరణులు, వైఖరులను మార్చుకొని సామర్థ్యాన్ని పెంచుకొని పట్టుదలతో కృషిచేసి గొప్పపేరు తెచ్చుకోవాలని కోరారు. డీఎల్పీవోలు, ఎంపీడీవోలతో డీపీవోలు నిరంతరం సమావేశాలు నిర్వహించాలని, నిత్యం గ్రామాభివృద్ధిమీదనే దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ‘సేవ్ ద పీపుల్.. సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్’ (ప్రజలను కాపాడండి, గ్రామాలను కాపాడండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి ) అని అదనపు కలెక్టర్లు, డీపీవోలకు స్పష్టంచేశారు. పనితీరు సరిగా లేనప్పుడు షోకాజ్ నోటీసులు పంపడమే కాదు, తాత్సారం చేయకుండా చర్యలు కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా, మున్సిపల్, మండల స్థాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ కో ఆర్డినేషన్ మీటింగ్స్ నిరంతరం నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. పట్టణ స్థానిక సంస్థలు నాటే మొకల విషయంలో ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్లు సర్టిఫై చేయాలన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులకు ఓరియంటేషన్ క్లాసులను రెగ్యులర్గా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. నర్సరీలు, వెజ్, నాన్వెజ్ మారెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్నిఅంశాల్లో ప్రతి పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్ట్ తయారుచేయాలని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో మహిళలకు ఇబ్బంది లేకుండా పబ్లిక్ టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ ఎలా ఉన్నదో అధ్యయనంచేయడానికి మూడు, నాలుగు దేశాలకు ఒక అధికారుల టీమ్ను పంపించాలని సూచించారు. మిషన్ భగీరథ తాగునీరు పట్టణాలకు బల్ సప్లయ్ పూర్తిస్థాయిలో అందుతున్నదని, అయితే, అంతర్గతంగా పైప్లైన్ల సమస్యను పరిషరించుకోవాలని ఆదేశించారు. వెజ్, నాన్వెజ్ మారెట్ల ఏర్పాటు విషయంలో అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు సికింద్రాబాద్లోని మోండా మారెట్, గజ్వేల్లోని సమీకృత మారెట్ను సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు కియా కార్నివాల్ వాహనాలను అందజేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఆదివారం ప్రగతిభవన్లో రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొత్త వాహనాలను జెండాఊపి ప్రారంభించారు. ఆయా వాహనాలను రవాణాశాఖ ద్వారా కొనుగోలుచేసి అడిషనల్ కలెక్టర్లకు కేటాయించారు. అంతకుముందు జిల్లా అదనపు కలెక్టర్లకు అందజేసే నూతన వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.