హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కరోనా బారినపడి ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ కొరత, ట్యాంకర్లతో సరఫరా అంతటా ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ప్లాంట్ అవసరం లేకుండా ఇంట్లోనే వెంటిలేటర్ వసతి పొందే ‘5ఎం హెల్త్ బూస్ట్’ పరికరాన్ని హైదరాబాద్కు చెందిన డేవిడ్ ఇష్కల్ తయారుచేశారు. ఇంజినీరింగ్ పూర్తిచేసి ఇన్నోవేటర్గా స్థిరపడ్డ డేవిడ్ ఇష్కల్.. ఈ పరికరాన్ని తానే వినియోగించి కరోనాను జయించానని తెలిపారు. ఈ పరికరాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించారని, దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే ఆక్సిజన్ కొరతను అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఈ పరికరం ద్వారా ఒకేసారి ఐదుగురికి ఆక్సిజన్ అందించవచ్చని వెల్లడించారు. . కరోనా రోగులకు ఈ పరికరం బాగా పనిచేస్తుందని తెలిపారు.
వెబినార్ల ద్వారా తెలుసుకున్నా..
గతేడాది ఫిబ్రవరిలో కరోనా వల్ల నాకు ఊపిరితీసుకోవడం కష్టమైంది. చైనాలోని వూహాన్ లో ఇన్హలేషన్ థెరపీతో 90 శాతం మంది కోలుకున్నారని వెబినార్ల ద్వారా తెలుసుకున్నా. దీనిపై అధ్యయనం చేశా. ఆటోమొబైల్ టెక్నాలజీలో వినియోగించే ప్లాస్మా పరికరాన్ని రీ-ఇంజినీరింగ్ చేసి ‘5ఎం హెల్త్ బూస్ట్’ పరికరం తయారుచేశా. దీన్ని వాడిన కొద్ది సమయానికే శ్వాస తీసుకోవడం తేలికైంది. ముక్కుకారడం తగ్గింది. ఇంట్లో వాళ్లకు శ్వాససంబంధ సమస్య వస్తే దీనినే వినియోగిస్తున్నాం. – డేవిడ్