న్యూఢిల్లీ, మే 22: నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) సేవలు ఆదివారం 14 గంటలపాటు నిలిచిపోనున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట నుంచి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని బ్యాంకులు తెలియజేశాయి. శనివారం పని వేళలు ముగిసిన తర్వాత నెఫ్ట్ వ్యవస్థ టెక్నికల్ అప్గ్రేడ్ ఉంటుందని, అందుకే ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్ సేవలను ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు వినియోగించుకోలేరని ట్విట్టర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పష్టం చేసింది. అప్గ్రేడ్ పూర్తయ్యాక నెఫ్ట్ సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయని బ్యాంకర్లు తెలిపారు. అయితే రియల్-టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) సేవలు మాత్రం యథాతథంగానే కొనసాగనున్నాయి. కాగా, గత నెల 18న ఆర్టీజీఎస్ సిస్టమ్నూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) టెక్నికల్గా అప్గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు నెఫ్ట్ సిస్టమ్నూ సాంకేతికంగా ఆధునికీకరిస్తున్నది. రూ.2 లక్షలలోపు నగదు బదిలీలకు నెఫ్ట్ను వినియోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఈఎంఐ చెల్లింపులనూ జరుపవచ్చు. ఇక అత్యవసర చెల్లింపులకు ఆర్టీజీఎస్ను వాడుతున్నారు. ఈ రెండు వ్యవస్థల నిర్వహణ ఆర్బీఐ పరిధిలోనే ఉంటుంది.