లక్నో: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర ప్రదేశ్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్లో చిక్కుకుని ఆరోగ్యం విషమించి మరణించిన కాన్పూర్ మహిళ కుటుంబానికి పోలీస్ అధికారులు క్షమాపణ చెప్పారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కాన్పూర్ చాప్టర్ మహిళా విభాగానికి అధిపతి అయిన 50 ఏండ్ల వందన మిశ్రా ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వాహనంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్రపతి రాక నేపథ్యంలో ట్రాఫిక్ను చాలా సేపు నిలిపివేశారు. దీంతో ఆసుపత్రికి తరలించే సరికి వందన మిశ్రా మరణించారు.
ఈ ఘటనపై కాన్పూర్ పోలీస్ చీఫ్ అసిమ్ అరుణ్ విచారం వ్యక్తం చేశారు. తమకు ఇది గుణపాఠమని, భవిష్యత్తులో ఇలా జరుగకుండా చర్యలు చేపడతామని ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్రపతి పిలుపుతో కాన్పూర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఈ ఘటనపై దర్యాప్తు చేశారు. బాధిత కుటుంబానికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. దీంతో అధికారులు శనివారం వందన మిశ్రా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్రపతి, పోలీసుల తరుఫున క్షమాణలు చెప్పారు. ట్రాఫిక్ను చాలా సేపు నిలివేసేందుకు బాధ్యులైన ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేశారు.