వికారాబాద్, జూన్ 23, (నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణలో భాగంగా దశల వారీగా వ్యాక్సిన్ అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. ఈనెల 15 నుంచి మండల, మున్సిపాలిటీల్లోని 13 శాఖలకు చెందిన ఉద్యోగులు, సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ చేపట్టారు. గురువారం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్పై దృష్టి సారించనున్నా రు.. జిల్లాలోని 18 నుంచి 44 ఏండ్ల వయస్సు వారికి, 44 ఏండ్లు పైబడిన వారికి, రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే వారు, పండ్లు, పూల వ్యాపారులు, కిరాణా, చికెన్, మటన్, లిక్కర్ దుకాణాల్లో పనిచేసే వారికి, లాండ్రీ షాపులు, హెయిర్ సెలూన్లలో పనిచేసే వారు, హోటళ్లు, శ్మశాన వాటికల్లో పనిచేసే వారికి వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 15 వర్గాలకు చెందిన వారు పంచాయతీ కార్యదర్శుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది.
విడుతల వారీగా వ్యాక్సినేషన్..
గురువారం నుంచి విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయులు, ఆయా శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. విడుతల వారీగా వ్యాక్సిన్ వేయనున్నారు. తొలి విడుతలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలకు టీకా ఇవ్వగా, రెండో విడుతలో ఫ్రంట్లైన్ వారియర్స్ పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఇచ్చారు. అనంతరం సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారికి టీకా వేశారు. తొలి, మలి విడుత వ్యాక్సినేషన్ సైతం అంతంత మాత్రం సాగడంతో ఈసారి మరింత మందికి టీకా వేసేందుకు శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ తీవ్రత పెరడగంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ఆసక్తితో ఉన్నారు. దీంతో గురువారం నుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు దృష్టి సారిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో టీకా వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 7వేల మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు గుర్తించామని సంబంధిత అధికారులు వెల్లడించారు.
జిల్లా జనాభా 9,27,140 మంది
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 9లక్షల 27వేల 140 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 4లక్షల 63వేల 350 మంది కాగా, పురుషులు 4లక్షల 63వేల 790 మంది ఉన్నారు. 18 నుంచి 35 ఏండ్ల వయస్సున్న వారు మొత్తం 4లక్షల 97వేల 137 మంది కాగా, ఇందులో మహిళలు 2లక్షల 45వేల 055 మంది, పురుషులు 2లక్షల 52వేల 082 మంది ఉన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. కొవిడ్కు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తోంది. అర్హులందరికీ వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతకు వ్యాక్సిన్ అందించేలా ప్రణాళిక రూపొందించింది. కరోనా సెంకడ్ వేవ్ విజృంభించిన తర్వాత అందరూ అప్రమత్తంగానే ఉన్నారు. ఇప్పటికే దశాల వారీగా అందరికీ టీకాలు వేస్తున్నారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారు దాదాపు 5లక్షల మంది ఉన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీరికోసం ఎన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలు, ఎన్ని పంచాయతీల్లో టీకాలు వేయించాలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
22 పీహెచ్సీలు, 5 సీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ ..
జిల్లావ్యాప్తంగా 22 పీహెచ్సీలు, 5 సీహెచ్సీల్లో వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ దఫా గ్రామీణ ప్రాంతాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో అన్ని పీహెచ్సీల్లో టీకా వేయనున్నారు. ఇందుకోసం అవసరమైన పూర్తిస్థాయి సిబ్బందిని పీహెచ్సీల్లో ఏర్పాటుచేశారు. టీకా కోసం వచ్చే వారు తమ ఐడీ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని రావాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఇలా..
వ్యాక్సిన్ కోసం పోర్టల్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసుకోవాలి. పిన్కోడ్ ఆధారంగా టీకా కేంద్రాలు వస్తాయి. వాటి ఆధారంగా తేదీ, సమయం ఎంచుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలి.
కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్
జులై 1 నుంచి కళాశాలలు ప్రారంభమవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్ టీకా తీసుకుని కళాశాలలకు రావాలని యాజమాన్యాలు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు టీకా కోసం కేంద్రాలకు వెళ్లనున్నారు. ఈ నెల 21 నుంచి 18-44 ఏళ్ల వయస్సు వారికి టీకా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఈ నెల 21 నుంచి వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో నేటి నుంచి ఉపాధ్యాయులకు టీకా వేస్తున్నాం. మిగిలిన వారికి తర్వలో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో ఉపాధ్యాయులు 7వేల మందికి పైగా ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.