రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయ ఉద్యోగి లడ్డూ అమ్మకాల్లో చేతివాటం ప్రదర్శించి రూ. 40 లక్షలు కాజేశాడు. తప్పుడు లెక్కలతో అతను ఈ మోసానికి పాల్పడ్డాడు. డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లుగా సమాచారం. ప్రసాదం తయారీ విభాగం క్రాస్ చెక్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కౌంటర్లో లడ్డూల స్టాక్ లేనప్పటికీ 2 లక్షల లడ్డూలు ఉన్నట్లుగా సదరు ఉద్యోగి పేర్కొంటూ తప్పుడూ లెక్కలు సృష్టించాడు.
అవకతవకలు వెలుగులోకి వచ్చినప్పటికీ, లడ్డూ ఉత్పత్తి శాఖ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు. అవకతవకల గురించి ప్రశ్నించినప్పుడు ఉద్యోగి ఒక వారం క్రితం తిరిగి నగదు చెల్లించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మోసం గురించి ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ను ప్రశ్నించగా ఆరోపణలపై విచారణ జరపనున్నట్లు తెలిపారు. అవినీతి జరిగినట్లుగా తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.