న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడానికి యూకే వేరియంటే కారణమని తేలింది. శాంపిళ్లను విశ్లేషించడం ద్వారా దీని వెనుక ఉన్నది యూకే స్ట్రెయిన్ అని తేలినట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) వెల్లడించింది. ఢిల్లీలో 400 కేసులు యూకే స్ట్రెయిన్కి, 76 ఇండియన్ డబుల్ మ్యుటెంట్ కేసులు కనిపించినట్లు ఎన్సీడీసీ తెలిపింది. దేశంలోని మొత్తం శాంపిళ్లలో 11 శాతం ఆందోళనకర వేరియంట్లు ఉన్నట్లు కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.
ఇప్పటివరకు ఇండియాలో మొత్తం 1644 యూకే వేరియంట్ కేసులు, 112 సౌతాఫ్రికా, 732 బ్రెజిల్ వేరియంట్ కేసులు ఉన్నాయి. మార్చిలోనే ఢిల్లీ శాంపిళ్లను పరిశీలించగా యూకే వేరియంట్ రెట్టింపై మొత్తంలో 50 శాతానికి చేరినట్లు ఎన్సీడీసీ చెప్పింది. ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న పది ల్యాబ్లలో ఎన్సీడీసీ కూడా ఒకటి.
దీనిని బట్టి ఢిల్లీలో కేసులు పెరగడానికి ప్రత్యక్షంగా యూకే వేరియంట్కే సంబంధం ఉన్నట్లు తేలిపోతుందని ఎన్సీడీసీ డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో యూకే వేరియంట్, డబుల్ మ్యుటెంట్ రెండూ ఉన్నాయి. మార్చి 2న మొత్తం కేసుల్లో 28 శాతంగా ఉన్న యూకే వేరియంట్ కేసులు మార్చి చివరి వారంలో 50 శాతానికి చేరాయి. దీనినిబట్టే యూకే కేసుల పెరుగుదలలో యూకే వేరియంట్కు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు అని సుజీత్ కుమార్ అన్నారు.
మొత్తం 15,135 శాంపిళ్ల జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఇందులో ఈ మూడు వేరియంట్లు కలిపి 11.5 శాతం అంటే 1735 ఉన్నాయి. ఇక మహారాష్ట్రలోనూ 64 యూకే వేరియంట్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలోనూ 170 యూకే వేరియంట్ కేసులు ఉన్నట్లు ఈ జీనోమ్ సీక్వెన్సింగ్లో తేలింది. మరో 57 సౌతాఫ్రికా వేరియంట్ కేసులు, మూడు డబుల్ మ్యుటెంట్ కేసులు తెలంగాణలో ఉన్నట్లు ఎన్సీడీసీ తెలిపింది.