ముంబై, మే 21: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎటవల్లిలోని పైడి అటవీ ప్రాం తంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. చనిపోయిన నక్సలైట్లు అందరూ కసన్సుర్ దళానికి చెందినవారని పోలీసులు తెలిపారు. జిల్లాలో రాష్ట్ర హోంమంత్రి పర్యటన చేపట్టిన రోజే ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో సీ-60 కమాండోస్ బృందం పైడి అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టింది. పోలీసులకు ఎదురుపడిన సుమారు 60-70 మంది మావోయిస్టులు కాల్పులను ప్రారంభించారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఉదయం 6-7.30 గంటల మధ్య ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నది. కాల్పుల్లో 13 మంది నక్సల్స్ మరణించగా, మరింత మంది గాయపడి ఉంటారని, వారు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. గాలింపును కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, ఎస్ఎల్ఆర్, కార్బైన్, .303 రైఫిల్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 2019లో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బందికి ఈ ఎన్కౌంటర్ నివాళి అని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 27 మంది నక్సల్స్ హతమైనట్టు చెప్పారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన దిలీప్ వాల్సే పాటిల్.. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులను అభినందించారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని, వారిపై సమర్థంగా పోరాడుతున్న పోలీసులను చూసి గర్విస్తున్నామన్నారు.