న్యూఢిల్లీ :కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో దవాఖానలు, వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నా రోగుల్లో మనోధైర్యం నింపేందుకు వైద్యారోగ్య సిబ్బంది చిరునవ్వుతో శ్రమిస్తున్నారు. వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నా సిబ్బంది ఆ భయాన్ని పక్కనపెట్టి రోగులకు చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ వార్డులు వార్ రూమ్ లను తలపిస్తున్న నేపథ్యంలో రోగులను ఉత్తేజపరిచేందుకు వైద్య సిబ్బంది ఓ పంజాబీ పాటకు ఆడిపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోగులను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్లు ధరించిన డాక్టర్లు, ఇతర సిబ్బంది రోగులతో కలిసి పంజాబీ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. కొందరు రోగులు చప్పట్లు కొడుతూ బెడ్ పైనే భాంగ్రా స్టెప్పులను అనుకరించారు. గుర్మీత్ చద్దా అనే యూజర్ బుధవారం రాత్రి ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు.