లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్సింగ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఈ మేరకు మంగళవారం సంజయ్గాంధీ పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓ బులెటిన్ను విడుదల చేసింది. కళ్యాణ్సింగ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నదని ఆ బులెటిన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను లైఫ్ సేవింగ్ సపోర్టుపై ఉంచామని, ఆయనకు నిర్విరామంగా డయాలసిస్ కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు.
నిపుణులతో కూడిన వైద్య బృందం ఆయన ఆరోగ్యపరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నదని సంజయ్గాంధీ పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేర్కొన్నది. కాగా, ఈ ఉదయం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆస్పత్రికి వెళ్లి కళ్యాణ్సింగ్ను చూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదిలావుంటే 89 ఏండ్ల కళ్యాణ్సింగ్ కిడ్నీ సమస్యతో ఈ నెల 4న ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు ఆయన రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందారు.