న్యూఢిల్లీ : దేశంలో వెలుగుచూస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్పై కోవిషీల్డ్, కొవ్యాక్సిన్లు ఎంతవరకూ ప్రభావవంతంగా పనిచేస్తాయనేది పరీక్షిస్తున్నామని, వారం పదిరోజుల్లో ఈ వేరియంట్పై వ్యాక్సిన్ల సామర్ధ్యం ఏపాటిదో తెలుస్తుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బల్రాం భార్గవ పేర్కొన్నారు. గత వేరియంట్లపై చేసిన తరహాలోనే డెల్టా ప్లస్ పైనా వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని పరీక్షిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 48 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయని చెప్పారు.
గర్భిణులకు వ్యాక్సిన్ ఇవ్వచ్చని, ఇక చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రస్తుతం ఒకే ఒక్క దేశంలో చేపడుతున్నారని, చాలా పరిమిత సంఖ్యలో చిన్నారులకు వ్యాక్సిన్ అవసరమవుతుందా అనేది ప్రశ్నార్ధకంగానే ఉందని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసులు దిగివస్తున్నాయని, ఇప్పటివరకూ దాదాపు 30.79 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందించామని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం కేవలం 125 జిల్లాల్లోనే వందకు పైగా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. కొవిడ్-19 రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.