న్యూఢిల్లీ : కరోనా టీకాల కొరతపై రాజకీయ నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలు భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండ్వియ అన్నారు. జులై నెలలో పంపిణీ చేసే వ్యాక్సిన్ డోసుల వివరాల గురించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇచ్చామని చెప్పారు.
వ్యాక్సిన్ల లభ్యతపై కొన్ని రాష్ట్రాలు, నేతలు రాస్తున్న లేఖలు, ప్రకటనలను మంత్రి ప్రస్తావిస్తూ వాస్తవాలను సరిగ్గా విశ్లేషించడం ద్వారా పరిస్థితిని మెరుగ్గా అర్ధం చేసుకోగలుగుతామని మంత్రి స్పష్టం చేశారు. అర్ధరహిత ప్రకటనలు ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తాయని ఆయన బుధవారం ట్వీట్ చేశారు.
జూన్ నెలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 11.46 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయగా, జులైలో వీటి సంఖ్య 13.50 కోట్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. జులైలో ఎన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని జూన్ 27నే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నివేదించామని చెప్పారు. వ్యాక్సిన్ లభ్యతకు అనుగుణంగా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా క్షేత్రస్ధాయిలో టీకా పంపిణీని ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు సమాచారం చేరవేస్తోందని మంత్రి తెలిపారు.