లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పర్యావరణం దెబ్బతింటోందని కాషాయ పార్టీపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. పర్యావరణ పరిరక్షణపై బీజేపీ ఆర్భాటపు ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఏటా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నా ఎన్ని మొక్కలు నాటారనే వివరాలను వెల్లడించడం లేదని ఎద్దేవా చేశారు.
బీజేపీ యూపీలో పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం సాగుతోందని అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. తమ హయాంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టామని గుర్తుచేశారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో చెరువులు తవ్వి, గ్రీన్ పార్కులు డెవలప్ చేశామని చెప్పారు.