హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కారోనా శరీరంలో ఏ అవయవంపై ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పడం ఈ కాలంలో కష్టంగానే ఉంటున్నది. ఎందుకంటే కొత్తగా కనిపిస్తున్న ఏ లక్షణమైనా కరోనాయే కావొచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇదే విధంగా చర్మసంబంధ సమస్యలు వస్తున్నాయని స్పష్టంచేస్తున్నాయి. శరీరంలోకి ఒక వైరస్ ప్రవేశించినపుడు లేదా వైరల్ జబ్బుకు సంబంధించిన చికిత్స పొందుతున్నప్పుడు కొందరిలో చర్మంపై ప్రభావం పడుతుందని చర్మసంబంధ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటివారిలో దద్దుర్లు, ఎరుపు రంగులోకి చర్మం మారిపోవడం, ఎరుపు రంగు బొబ్బలు, రెండు మూడు గంటలపాటు వస్తూ పోతుండే దద్దుర్లు, చేతి వేళ్ల రంగు మారడం, కంటిలోని తెల్ల గుడ్డు ఎర్రగా మారడం, చర్మంపై నీటి బుగ్గలు రావడం.. ఇలాంటివి వస్తున్నట్టు స్పష్టంచేస్తున్నారు. ఇందులో చాలా మందిలో చర్మ సంబంధ సమస్యలు కరోనా తగ్గిన పది, పదిహేను రోజుల్లో తగ్గుతున్నాయని, కొద్ది మందికి మాత్రమే తగ్గేందుకు మందులు అవసరం పడుతుందని పేర్కొన్నారు. చిన్నారుల్లో వైరస్ పెద్దగా ప్రభావం చూపకపోయిన్పటికీ, అతి కొద్ది మందిలో మాత్రం సివియర్ మల్టీసిస్టం ఇన్ఫ్లేమేటరీ సిండ్రోమ్ వస్తున్నట్టు చెప్తున్నారు. దీనివల్ల చర్మం మొత్తం ఎర్రగా మారడం, పెదవులు పగలడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు పేర్కొంటున్నారు. పోస్ట్ కొవిడ్ డిసీజ్గా వెంట్రుకలు రాలడం కనిపిస్తున్నది. మహమ్మారి తగ్గిన రెండు, మూడు నెలల్లో కొందరికి వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఇది సాధారణ విషయమే.. తర్వాత సాధారణ స్థితికి వస్తుంది. కంటి నిండ నిద్ర, మంచి ఆహారం తీసుకోవడం మరచిపోవద్దని సూచిస్తున్నారు.
వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇమ్యూన్ సిస్టం ఓవర్ రియాక్ట్ అవుతుంది. అప్పుడు చర్మంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇది అతికొద్ది మందిలో మాత్రమే జరుగుతుంది. చర్మంపై దద్దుర్లు రావడం కూడా ఇప్పుడు కరోనా లక్షణమే. జ్వరం, ఒంటి నొప్పులు, దగ్గు వంటి లక్షణాలకు తోడు చర్మసంబంధ సమస్యలుంటేనే అనుమానించాలి. పెదవులు పగలడం, అల్సర్లు, నోటి పూత రావడం, దద్దుర్లు, ఎర్ర బొడిపెలు ఇలాంటి చర్మ సమస్యలు కరోనా రోగుల్లో చూస్తున్నాం. చాలా మందిలో ఇవి కొద్ది రోజుల తర్వాత తగ్గిపోవడం గమనిస్తున్నాం. ఎక్కువ సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.
డాక్టర్ బీ విజయశ్రీ, డెర్మటాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్