జైసల్మేర్: రాజస్థాన్లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. జైసల్మేర్ జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తన అధికారిక నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జైసల్మేర్ జిల్లాలోని మోహన్గఢ్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న భజన్లాల్ (46) మంగళవారం విధులకు హాజరుకాలేదు.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భజన్లాల్ విధులకు హాజరుకాకపోవడంతో అధికారులు విచారణ కోసం ఓ కానిస్టేబుల్ను అతని ఇంటికి పంపించారు. ఆ కానిస్టేబుల్ ఎంతసేపు తలుపుతట్టినా భజన్లాల్ తీయకపోవడంతో పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. దాంతో అధికారుల ఆదేశాల మేరకు మరికొందరు కానిస్టేబుల్లు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా భజన్లాల్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు.
దాంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఘటనా ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, భజన్లాల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.