‘
లక్షెట్టిపేట రూరల్, మే 2 : ‘నా 16 ఏండ్ల కష్టార్జితాన్ని ఇప్పించండి’ అంటూ మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన వలస కార్మికుడు పెట్టెం కిషన్ ఆదివారం ఇండియన్ ఎంబసీకి ‘మదద్’ పోర్టల్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. యూఏఈ రాజధాని అబుదాబిలోని ఓ ప్రైవేట్ కంపెనీ ఘంతూత్ ట్రాన్స్పోర్టు అండ్ జనరల్ కాంట్రాకింగ్ సంస్థలో 2004 నుంచి 2020 వరకు ఒక సాధారణ కార్మికుడిగా, ఎలక్ట్రీషియన్గా పని చేశాడు. గత సంవత్సరం అక్టోబర్లో ఇండియాకు వచ్చాడు. మార్చిలో లాక్డౌన్ ప్రకటించడం, విమానాల రాకపోకల నిలిపివేతతో మళ్లీ అబుదాబికి వెళ్లలేక పోయాడు. అదే అదునుగా భావించి తన వీసాను కంపెనీ యాజమాన్యం ఆన్లైన్లో రద్దు చేశారని వాపోయారు. తనకు రావాల్సిన 16 సంవత్సరాల పీఎఫ్, గ్రాట్యుటీ, బోనస్ లాంటి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందేలా చూడాలని కోరాడు.
న్యాయం జరిగేలా చూస్తాం..
చాలా కంపెనీలు ఇక్కడి కార్మికులను దోపిడీ చేస్తున్నాయని ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పరికిపండ్ల స్వదేశ్ ఆరోపించారు. వాటిపై ‘జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్’ చట్టం ద్వారా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఎంతో మందికి మేలు చేశామని పేర్కొన్నారు. వలస కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉన్నామని, అవసరమైన వారు యూనియన్ హెల్ప్లైన్ నంబర్ 92817 63686కు నేరుగా కాల్ చేయాలని ఆయన సూచించారు.