గౌహతి: కరోనా టెస్ట్ చేయించుకోకుండా తప్పించుకున్న 300 మంది విమాన ప్రయాణికులపై చర్యలకు అధికారులు రంగంలోకి దిగారు. వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. అస్సాంలోని సిల్చార్ విమానాశ్రయంలో బుధవారం పలు నగరాల నుంచి ఆరు విమానాలు ల్యాండ్ అయ్యాయి. 690 మంది ప్రయాణికులు ఇక్కడకు చేరుకున్నారు. వారంతా ఎయిర్పోర్ట్తోపాటు, సమీపంలోని ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉన్నది.
అయితే మొత్తం ప్రయాణికుల్లో కేవలం 189 మంది మాత్రమే కరోనా పరీక్ష చేయించుకోగా ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇతర కారణాలతో కొందరు మినహాయింపు పొందగా సుమారు 300 మంది విమాన ప్రయాణికులు కరోనా టెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఎయిర్పోర్ట్ నుంచి పరుగులుతీశారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న సిల్చార్ జిల్లా అధికారులు వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విమాన ప్రయాణికుల డేటా ఆధారంగా టెస్ట్ చేయించుకోని వారిని గుర్తించి సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
అస్సాంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు, విమానాల్లో వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా వారం రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని వెల్లడించింది. కరోనా టెస్ట్లో నెగిటివ్గా వచ్చినప్పటికీ వారం రోజులు హోం క్వారంటైన్ తప్పని సరి అని స్పష్టం చేసింది.