కాబూల్: రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తమ బలగాలను మోహరించిన అమెరికా.. ఇప్పుడు తాను విధించిన డెడ్లైన్లోపే ఆ దేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి అమెరికా చివరి సైనికుడు కూడా ఆఫ్ఘన్ను వదిలి వెళ్లాడు. ఆ చివరి సోల్జర్కు సంబంధించిన ఫొటోను అమెరికా రక్షణ శాఖ షేర్ చేసింది. ఆర్మీ మేజర్ జనరల్ అయిన క్రిస్ డొనాహ్యూ ఆఫ్ఘన్ నుంచి వెళ్లిన చివరి అమెరికా సైనికుడిగా నిలిచాడు. నైట్ విజన్ కెమెరాతో తీసిన ఆ ఫొటోలో కాబూల్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కడానికి వెళ్తున్న క్రిస్ను చూడొచ్చు.
ఆఫ్ఘన్ నుంచి ఆగస్ట్ 31లోపు తమ బలగాలను ఉపసంహరించుకుంటామని గతంలోనే అమెరికా ప్రకటించింది. ఆగస్ట్ 15న ఆ దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ అమెరికా మొత్తం లక్షా 22 వేల మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించింది. చివరి అమెరికా విమానం కాబూల్ నుంచి పైకి లేవగానే.. తాలిబన్లు ఆనందంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆఫ్ఘనిస్థాన్కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్లు ప్రకటించారు.
ఈ 20 ఏళ్లలో అమెరికా బలగాలకు చెందిన 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2 లక్షల 40 వేల మంది ఆఫ్ఘన్లు కూడా మృత్యువాత పడ్డారు. రెండు దశాబ్దాల్లో అమెరికా మొత్తం 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ఆగస్ట్ 15 నుంచి ఆఫ్ఘన్లోని తమ పౌరులతోపాటు స్థానిక ఎంబసీ సిబ్బంది, పౌర హక్కుల నేతలు, జర్నలిస్టులు, ఆఫ్ఘన్ పౌరులను కూడా అమెరికా తరలించింది.