మన్సూరాబాద్, జూలై 12: నాగోల్ డివిజన్ పరిధిలో నిర్వహించే కాటమయ్య, మహంకాళి పోచమ్మ బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం తెలిపారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాటమయ్య, మహంకాళి పోచమ్మ బోనాల ఉత్సవాల తేదీలను ఖరారు చేశారు. కాటమయ్య బోనాలు ఆగష్టు ఐదున, మహంకాళి పోచమ్మ బోనాలను ఆగష్టు ఎనిమిదిన నిర్వహించాలని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలకు భక్తులు హాజరై అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవచైతన్య యువజన సంఘం అధ్యక్షుడు చెరుకు ప్రవీణ్కుమార్ గౌడ్, నాగోల్ గ్రామ కమిటీ చైర్మన్ బద్దం ధనుంజయ గౌడ్, మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ బద్దం మహేందర్గౌడ్, పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ చింతల సురేందర్ యాదవ్, నాయకులు స్వాతిన్ గౌడ్, మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.