చండీగఢ్: హర్యానాలో కర్నాల్ జిల్లా అధికారులు, భారతీయ కిసాన్ యూనియన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. గత నెల 28న కర్నాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ లాఠీ చార్జిలో 10 మంది రైతులు గాయపడ్డారు. ఈ లాఠీ చార్జికి నిరసనగా ఈ నెల 7న (మంగళవారం) మహాపంచాయత్ పేరుతో రహదారుల దిగ్బంధనం, మిని సెక్రెటేరియట్ ముట్టడి చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం రైతు నేతలతో కర్నాల్ జిల్లా అధికారులు సమావేశమయ్యారు. కానీ, ఈ సమావేశంలో వారి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సమావేశం అనంతరం కర్నాల్ జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రైతుల డిమాండ్లలో న్యాయం లేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి నష్టపరిహారం ఇవ్వలేమని, లాఠీ చార్జి చేసిన తమ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆయన స్పష్టంచేశారు. రేపు రైతులు హైవేలను బ్లాక్ చేయకుండా, మినీ సెక్రెటేరియట్ను ముట్టడించకుండా తాము అడ్డుకుంటామని చెప్పారు.
కాగా, హర్యానా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గురునామ్ సింగ్ చారుణి మాట్లాడుతూ.. కర్నాల్ అధికారులతో జరిగిన చర్చలతో ఎలాంటి ఫలితం లభించలేదన్నారు. తాము రేపు మహాపంచాయత్ నిర్వహిస్తామని, ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా జాతీయరహదారిని దిగ్బంధిస్తామని, మినీ సెక్రెటేరియట్ను ఘెరావ్ చేస్తామని తెగేసి చెప్పారు. దాంతో కర్నాల్లో రేపు ఏం జరుగబోతోందోననే ఉత్కంఠ నెలకొన్నది.