న్యూఢిల్లీ: హర్యానాలో బీజేపీ మీటింగ్ను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్ల తలలు పగులగొట్టిన సంగతి తెలుసు కదా. అయితే రైతుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించాలని చెప్పిన అధికారిపై ఇప్పుడు హర్యానా ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేల్ ఆయుష్ సిన్హా( Ayush Sinha ) పోలీసులకు ఈ ఆదేశాలు ఇస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సహా చాలా మంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సదరు అధికారిపై చర్యలు తీసుకోబోతున్నట్లు డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా ఆదివారం ప్రకటించారు.
2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆఫీసర్ వీడియో వైరల్ అయింది. అయితే ఆ ఆఫీసర్ రెండు రోజులుగా తాను నిద్రపోలేదని తర్వాత వివరణ ఇచ్చినట్లు ఉన్నారు. కానీ రైతులు 365 రోజులూ నిద్రపోలేదని గుర్తు పెట్టుకోవాలి. చర్యలు తీసుకుంటాం. అధికారులకు శిక్షణ సమయంలో సున్నితంగా వ్యవహరించాలని చెబుతారు అని దుశ్యంత్ చౌతాలా అన్నారు. శనివారం జరిగిన ఈ ఘటనలో పది మంది రైతులు గాయపడ్డారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ రాష్ట్ర చీఫ్ ఓం ప్రకాశ్ ధన్కర్ పాల్గొన్న సభకు నిరసనగా రైతులు ఆందోళన చేశారు.
అయితే ఆ రైతులు బ్యారికేడ్లను దాటి లోనికి రాకుండా చూడాలని అధికారి ఆయుష్ సిన్హా పోలీసులను ఆదేశించారు. ఆ లైన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటొద్దు. లాఠీ తీసుకొని గట్టిగా కొట్టండి. ఎలాంటి ఆదేశాలు అవసరం లేదు. ఎవరైనా నిరసనకారుడు నాకు ఇక్కడ కనిపిస్తే వాళ్ల తలలు పగిలి ఉండాలి అని ఆ వీడియోలో ఆయుష్ సిన్హా చెప్పడం వినిపించింది.