ఆది సాయికుమార్, సిమ్రత్కౌర్ జంటగా శిఖర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. భాస్కర్ బంటుపల్లి దర్శకుడు. గుడివాడ యుగంధర్ నిర్మాత. చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ తీగల పద్మారావు గౌడ్ హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్నిచ్చారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ‘నటీనటులతో పాటు దర్శకనిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి. సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎళ్లవేళలా సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. అంతర్లీనంగా వచ్చే తండ్రీకొడుకుల అనుబంధం ఆకట్టుకుంటుంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆది సాయికుమార్ కనిపిస్తారు. మే నెలాఖరున షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్లో సినిమాను పూర్తిచేస్తాం’ అన్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం నవ్వులను పంచే చిత్రమిదని ఆది సాయికుమార్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్ కొమండూరి.