సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 24 : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని మున్సిపల్ కమిషనర్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో శనివారం 43 వార్డులకు చెందిన 236 మంది అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ వార్డులోని వ్యక్తులను మాత్రమే ఏజెంట్లుగా నియమించాలన్నారు. పోలింగ్, కౌంటింగ్, ఎలక్షన్ ఏజెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కరోనా దృష్ట్యా ప్రచార సమయాన్ని ఎలక్షన్ కమిషన్ కుదించిందని, 27వ తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే ప్రచారం చేయాలన్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థి తమకు సంబంధించిన స్టిక్కర్లు ఇంటి యాజమాని అనుమతితోనే అంటించాలని, ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామన్నారు. 129 పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం, మూత్రశాలలు, విద్యుత్ సదుపాయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా వార్డుల్లో ఇప్పటికే ఎంసీసీ, వీఎస్టీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నాయన్నారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కట్టిన వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు, 80ఏండ్లు బడిన వారు, దివ్యాంగులు ఈ నెల 27వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, అభ్యర్థులు కూడా సహకరించి, ఎలాంటి సంఘటనలు జరుగకుండా సజావుగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.