చండీగఢ్: కరోనా బారిన పడిన పేదలకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.35,000 ఆర్థిక సహాయాన్ని హర్యానా సీఎం మనోహర్ లాఖ ఖట్టర్ ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూ, ఆక్సిజన్ సపోర్ట్పై ఉన్న రోగికి రోజుకు రూ.5,000 చొప్పున గరిష్ఠంగా వారం రోజులకు రూ.35 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. హర్యానాకు చెందిన కరోనా రోగులకు వైద్య చికిత్స అందించే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ప్రోత్సాహకంగా ఒక రోగికి రోజుకు రూ.1,000 చొప్పున గరిష్ఠంగా రూ.7,000 చెల్లిస్తామని చెప్పారు. ఈ విధంగా ఒక పేద రోగికి కరోనా చికిత్సకు మొత్తం రూ.42,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు.
మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా చికిత్సకు పడకల ధరలను కూడా హార్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఏబీహెచ్, జేసీఐ గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ఐసోలేషన్ పడకకు రూ.10,000, వెంటిలేటర్లు లేని ఐసీయూ పడకకు రూ .15 వేలు, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పడకకు రోజుకు రూ .18,000 చొప్పున నిర్ణయించింది.
ఎన్ఏబీహెచ్ గుర్తింపు లేని ఆసుపత్రులలో ఐసోలేషన్ పడకకు రూ .8,000, వెంటిలేటర్లు లేని ఐసీయూ పడకకు రూ .13,000, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పడకకు రోజుకు రూ .15 వేలు చొప్పున ధర నిర్ణయించినట్లు సీఎం కార్యాలయం బుధవారం వెల్లడించింది.