న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా ఆలస్యమైన హ్యాండాయ్ సిక్స్/సెవన్ సీటర్ ఎస్యూవీ మొత్తానికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. ఈ నెల 18న హ్యుండాయ్ అల్కజార్ కారును లాంచ్ చేస్తున్నట్లు గురువారం సంస్థ ప్రకటించింది. బుధవారం నుంచే రూ.25 వేలతో ఈ కారు బుకింగ్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. లుక్లో క్రెటాలాగే కనిపించే ఈ కారు డిజైన్లో కొన్ని మార్పులు చేశారు. గ్రిల్ను రీడిజైన్ చేయడంతోపాటు ఫాగ్ ల్యాంప్స్ కాస్త మార్చారు. మూడు వరుసల సీట్లను అమర్చడానికి వీలుగా కారు పొడవును క్రెటా కంటే కాస్త పెంచారు.
కారు లోపల 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చారు. 8 స్పీకర్లతో కూడిన బోస్ సౌండ్ సిస్టమ్, 8 విధాలుగా పవర్ అడ్జెస్ట్ చేసుకునేలా డ్రైవర్ సీటు, 64-కలర్ ఆంబియెంట్ లైటింగ్ సిస్టమ్, వాయిస్ ఎనేబుల్ చేసిన పనోరమిక్ సన్రూఫ్ ఉన్నాయి. అల్కజార్ ఆరు, ఏడు సీట్లలో వస్తోంది. సిక్స్ సీటర్ కారు మధ్యలో కెప్టెన్ సీట్లు, సెవన్ సీటర్ కారులో బెంచ్ సీట్లు వస్తాయి. దీని ధరను సంస్థ ఇంకా ఫైనల్ చేయలేదు. అయితే రూ.14 లక్షల నుంచి రూ.21 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.