న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలు కొవిడ్-19 నిబంధనలను పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తూ మహమ్మారిని తేలికగా తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ప్రజలు కొవిడ్-19 ప్రొటోకాల్ ను విధిగా పాటించాలని, మాస్క్ లు ధరిస్తూ, భౌతిక దూరం నిబంధనలను పాటించాలని కోరారు. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మనమందరం అప్రమత్తంగా ఉంటూ కరోనా కట్టడికి అన్ని చర్యలూ చేపడితేనే మహమ్మారి అంతమవుతుందని డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. మనం ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా కరోనా నిబంధనలను పాటించాలని, అందరూ త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ సమసిపోలేదని, అది తన రంగులు మార్చుకుంటోందని ఎయిమ్స్ మెడిసిన్ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ నవనీత్ విగ్ హెచ్చిరకల నేపథ్యంలో ఆరోగ్య మంత్రి ఈ ప్రకటన చేశారు.