న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మేథో సంపత్తి హక్కుల (ఐపీఆర్) విషయంలో పరిశ్రమ పట్టుదలతో ఉండేందుకు అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్లపై ఐపీఆర్ ఎత్తివేతను కోరుతూ ఉమ్మడి సవాళ్లను సమిష్టి బాధ్యతతోనే ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. రాబోయే రెండు దశాబ్ధాల్లో పలు తక్షణ ఆరోగ్య సవాళ్లు ఎదురుకానున్నాయని, దేశాలన్నీ ఒక స్ఫూర్తితో ముందుకు కదలాల్సిన అవసరం నెలకొందని అన్నారు.
డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా హర్ష వర్ధన్ పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం, గొంతుక లేని సామాన్యుల ప్రాణాలను కాపాడేందుకు ఇదే సరైన సమయమని ప్రపంచమంతా ఒకటే అనే స్ఫూర్తిని చాటేందుకు దేశాలన్నీ ఒక్కటి కావాలని పిలుపు ఇచ్చారు. ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంపద లేని వారికీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావాలని డాక్టర్ హర్షవర్ధన్ కోరారు.