చండీఘఢ్ : పంజాబ్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీష్ రావత్ స్పష్టం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. అసంతృప్త నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూను పార్టీ రాష్ట్ర చీఫ్గా నియమించనున్నట్టు హరీష్ రావత్ సంకేతాలు పంపారు. ఈ రాజీ ఫార్ములాకు కెప్టెన్ సింగ్తో పాటు సిద్ధూ అంగీకరించినట్టు తెలిసింది. దీని ప్రకారం పంజాబ్ సీఎంగా అమరీందర్ కొనసాగనుండగా.. పంజాబ్ పీసీసీ చీఫ్గా సిద్ధూని నియమించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ పార్టీలో వర్గపోరు హైకమాండ్ను ఆందోళనకు గురిచేయగా ఈ విభేదాలను సత్వరమే పరిష్కరించేందుకు చొరవ చూపింది. కెప్టెన్ సింగ్, సిద్ధూలు రాష్ట్రంలో కలిసి పనిచేస్తారని రావత్ వెల్లడించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మరికొందరిని నియమిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సీనియర్ నేత కమల్నాథ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి సోనియా గాంధీని పూర్తిస్ధాయిలో పార్టీ చీఫ్ పగ్గాలు చేపట్టేలా కసరత్తు సాగుతోందని సమాచారం.