న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం రాజ్యసభలో తనపై దాడి చేయబోయారని, సహచర ఎంపీలు తనను కాపాడారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శంతను సేన్ ఆరోపించారు. సభ వాయిదా పడిన తర్వాత హర్దీప్ సింగ్ తనను బెదిరించడంతోపాటు అసభ్యకరంగా మాట్లాడారని ఆయన విమర్శించారు. ‘సభ వాయిదా పడిన తరువాత, కేంద్ర మంత్రి హర్దీప్ పురి చాలా చెడ్డ పద్ధతిలో నన్ను పిలిచారు. నేను ఆయన దగ్గరకు వెళ్ళాను. అంతలో నన్ను బెదిరించడం మొదలుపెట్టారు. నాపై భౌతికంగా దాడి చేయబోయారు. నేను దాదాపు ఘెరావ్ అయ్యాను. దేవునికి ధన్యవాదాలు. నా సహచరులు దీనిని గమనించి నన్ను రక్షించారు. ఇలా జరుగడం దురదృష్టకరం’ అని శంతను సేన్ మీడియాతో అన్నారు. తన పట్ల అనాగరికంగా ప్రవర్తించిన హర్దీప్ సింగ్ పురిపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు తమ పార్టీ వెంటనే ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు.