రుద్రమూర్తికి పంచామృతాభిషేకాలు
మహా మృత్యుంజయ పాశుపత హోమం ప్రారంభం
శ్రీశైలం, మే 16: శ్రీశైలం మహాక్షేత్రంలో ఆది శంకరాచార్యుల జయంతి ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఆది శంకరాచార్యులు తపస్సు చేసి శివానందలహరి మహా గ్రంథాన్ని రచించిన పుణ్య స్థలమైన పాలదార పంచదార వద్ద ఉదయం శారదాదేవికి, శంకరాచార్యులకు షోడశోపచారాలు చేసి వారికి ప్రీతికరమైన పంచామృతాలు, శుద్ధగంగాజలంతో విశేష అభిషేకాలు, పుష్పార్చన మహా నివేదనలు చేశారు. అదేవిధంగా శ్రీశైలం రుద్రవనంలో శంకర జయంతి రోజున ప్రతిష్ఠింపబడిన 14అడుగుల ఎత్తైన రుద్రమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. రుద్రదేవుడి చల్లనిచూపు కృష్ణానదిపై ఎప్పుడూ పడుతూ ఉండాలని నదికి అభిముఖంగా ప్రతిష్ఠించిన స్వామివారికి పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద్ధ జలాలతో అభిషేకించి మహా బిల్వార్చన, పుష్పార్చనలు చేశారు. అదేవిధంగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించి రుద్రదేవుడి శాంతిమంత్రాలు వల్లించారు.
పాశుపత హోమంతో కరోనా కట్టడికి..
మహా మృత్యుంజయ పాశుపత హోమం నలభై రోజులపాటు నిర్విఘ్నంగా జరిపించేందుకు కార్యనిర్వాహణాధికారి దంపతులు వేదపండితులచే ఆదివారం ఉదయం స్వామివారి యాగశాలలో శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ఈ హోమంతో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ వంటివి దూరమై ఆయురారోగ్యాలు కలుగాలని సంకల్పించినట్లు ఈవో తెలిపారు.