న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రాణ నష్టం కలిగించిన సెకండ్ వేవ్ గత కొన్ని రోజులుగా నెమ్మదించింది. ఒక దశలో 34 వేల దిగువకు చేరిన రోజువారీ కొత్త కేసుల సంఖ్య గత రెండు మూడు రోజులుగా మళ్లీ 40 వేల పైకి చేరింది. అయితే, ఈ కొత్తగా నమోదవుతున్న కేసులలో సగానికిపైగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే వస్తున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కేరళలోని 14 జిల్లాలు, మహారాష్ట్రలోని 15 జిల్లాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఈ జిల్లాలే ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా సమసిపోలేదని, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ సూచించారు. అయితే, గత వారంతో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 8 తగ్గాయని తెలిపారు.