అహ్మదాబాద్: గుజరాత్లో నూతన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతున్నదని, మరో రెండు రోజుల్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నదని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల బీజేపీ హైకమాండ్ విజయ్ రూపానీతో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ను నియమించింది. దాంతో భూపేంద్ర పటేల్ సోమవారం గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
అయితే, ముఖ్యమంత్రి మినహా మంత్రులెవరూ ఆ రోజు ప్రమాణస్వీకారం చేయలేదు. కొత్త మంత్రివర్గ ఎంపిక పూర్తి కాకపోవడంతో బీజేపీ కేవలం భూపేంద్ర పటేల్తో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించింది. మరో రెండు రోజుల్లో నూతన మంత్రివర్గ కూర్పును పూర్తిచేసి వారితో కూడా ప్రమాణస్వీకారాలు చేయించనుంది. గుజరాత్ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్.. భూపేంద్ర పటేల్ సర్కారులో కూడా ఉపముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉన్నది. అదేవిధంగా రూపానీ క్యాబినెట్లోని నలుగురైదుగురు సీనియర్ నేతలకు భూపేంద్ర క్యాబినెట్లో కూడా చోటు కల్పించనున్నట్లు చర్చ జరుగుతున్నది.