అహ్మదాబాద్ : గఉ గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన టీ దుకాణదారుడికి అహ్మదాబాద్లోని మేజిస్ట్రేట్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. తన కేసు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండటంతో నిరాశ చెందిన వ్యక్తి అసహనంతో 2012లో హైకోర్టు న్యాయమూర్తి వైపు తన చెప్పును విసిరాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై తన విధిని నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకుగాను నిందితుడు భవానీదాస్ బవాజీపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. మిర్జాపూర్ రూరల్ కోర్టు చీఫ్ జూడిషియల్ మేజిస్ర్టేట్ వీఏ దాదల్ దోషిగా తేలిన బవాజీకి శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. న్యాయమూర్తిపై చెప్పులు విసిరే చర్య అత్యంత ఖండించదగినప్పటికీ అతని ఆర్థిక పరిస్థితి కారణంగా జరిమానా విధించటం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
నిందితుడు 2012 ఏప్రిల్ 11న కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జస్టిస్ కెఎస్ జావేరిపై చెప్పులు విసిరాడు. అదృష్టవశాత్తు అవి జడ్జీపై పడలేదు. న్యాయమూర్తి ఈ చర్యకు కారణాన్ని అడగగా బవాజీ తన కేసు చాలా కాలం నుండి విచారణకు రానందున, నిరాశతో ఈ పని చేసినట్లు చెప్పాడు.
బవాజీ భయావదర్లో రోడ్డు పక్కన టీ స్టాల్ నడుపుతున్నాడు. ఈ టీ స్టాల్ను తొలగించాల్సిందిగా మున్సిపల్ అధికారులు కోరినప్పుడు బవాజీ మున్సిపాలిటీ చర్యకు వ్యతిరేకంగా సెషన్స్ కోర్టు నుండి స్టే ఆర్డర్ పొందాడు. దీంతో మున్సిపాలిటీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. అప్పీల్ను అనుసరించి అధికారులు టీ స్టాల్ను తొలగించారు. టీ స్టాల్ తొలగించడం ద్వారా తనను నిరుద్యోగిగా మార్చారని, ఆదాయం లేకుండా చేశారని, మెంటల్ బ్యాలెన్స్ను కోల్పోయినట్లు, అహ్మదాబాద్లో కోర్టు విచారణకు హాజరు అయేందుకు సైతం అప్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. అదేవిధంగా సుదీర్ఘకాలం తన కేసు విచారణకు రాకపోవడంతో నిరాశకు గురై న్యాయమూర్తిపై చెప్పులు విసిరేసినట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.