అహ్మదాబాద్, సెప్టెంబర్ 11: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆచార్య దేవవ్రతకు సమర్పించారు. ‘రాష్ర్టాభివృద్ధి కోసం నా వంతు సహకారం అందించాను. భవిష్యత్తులోనూ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తాను’ అని రాజీనామా తర్వాత విలేకరులతో అన్నారు. బీజేపీలో పార్టీ కార్యకర్తల బాధ్యతలు సమయానుకూలంగా మారుతాయని, ఇది పార్టీ సంప్రదాయం అని పేర్కొన్నారు. రాష్ర్టానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
పాటిదార్లను ఆకర్షించడానికేనా?
గుజరాత్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రూపానీ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకొన్నది. గుజరాత్లో పటేల్ సామాజిక వర్గంలో ఒకరికి సీఎం పదవి ఇచ్చి వారిని తమ వైపునకు తిప్పుకొనేందుకే బీజేపీ రూపానీతో రాజీనామా చేయించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ తరువాతి సీఎం పాటిదార్ వర్గం నుంచి ఉంటారని భావిస్తున్నారు. ఇందులో గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నది.
ఉత్తరాఖండ్తో మొదలు
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సీఎంల మార్పు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. ఆరు నెలల్లో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నలుగురు సీఎంలు మారారు. ఉత్తరాఖండ్లో తొలుత త్రివేంద్ర సింగ్ రావత్ను తప్పించి తీరథ్ సింగ్ రావత్కు, నెలల వ్యవధిలోనే ఆయనను దించేసి పుష్కర్సింగ్ ధామీకి పదవిని కట్టబెట్టారు. కర్ణాటకలో సీనియర్ నేత యెడియూరప్ప స్థానంలో బీఎస్ బొమ్మైని నియమించారు. తాజాగా రూపానీ రాజీనామా చేశారు.