అహ్మదాబాద్: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లో రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం నేడు సమావేశం కానుంది. ఈ సందర్భంగా నూతన సీఎం అనే విషయంపై చర్చించనున్నది. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి హాజరుకానున్నారు. ఇప్పటికే నరేంద్ర సింగ్ తోమర్ గుజరాత్ చేరుకున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్తో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఇంటికి చేరుకున్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయం చర్చించడానికి తాము ఇక్కడికి వచ్చామని తోమర్ మీడియాతో అన్నారు. ఈ విషయమై పార్టీ అధ్యక్షుడు, ఇతర నాయకులతో చర్చిస్తామని చెప్పారు.
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ శనివారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రూపానీ రాజీనామాను గవర్నర్ ఆచార్య దేవవ్రత ఆమోదించారు. ‘రాష్ర్టాభివృద్ధి కోసం నా వంతు సహకారం అందించాను. భవిష్యత్తులోనూ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తాను’ అని రాజీనామా తర్వాత విలేకరులతో అన్నారు. బీజేపీలో పార్టీ కార్యకర్తల బాధ్యతలు సమయానుకూలంగా మారుతాయని, ఇది పార్టీ సంప్రదాయం అని పేర్కొన్నారు. రాష్ర్టానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు.