న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు కొత్త రికార్డును అందుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏప్రిల్లో మొత్తం వసూలైన రూ.1,41,384 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.27,837 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.35,621 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.68,481 కోట్లుగా ఉంది. జీఎస్టీ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఒక నెలలో వసూలైన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. గత ఆరు నెలలుగా జీఎస్టీ ఆదాయం పెరుగుతూనే ఉంది. మార్చి నెల కంటే ఏప్రిల్లో ఏకంగా 14 శాతం ఎక్కువ వసూలయ్యాయి. గత ఏడు నెలల్లో ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.