సూర్యాపేట, మే 20 (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ సోకిన వారికి రెమ్డెసివర్ ఇంజెక్షన్ వేయడం అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో దీనిని కొంత మంది బీజేపీ నాయకులు అక్రమార్జనకు వాడుకున్నారు. ఇటీవల సూర్యాపేటలో రెమ్డెసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెంటింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అత్యంత చాకచక్యంగా 12 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో ప్రధాన నిందితులుగా బీజేపీ నాయకులు ఉన్నారు. ఏ1, ఏ2లుగా బీజేపీకి చెందిన గుద్దేటి మాధవరెడ్డి, పందిరి కార్తీక్రెడ్డి, ఏ4గా కాంగ్రెస్ పార్టీకి చెందిన వల్లపు నరేశ్ ఉన్నారు. పోలీసులకు చిక్కిన ఈ ముఠా రూ.3500కు దొరికే రెమ్డెసివర్ ఇంజక్షన్ను రూ.35వేల నుంచి 40వేల వరకు బ్లాక్లో అమ్ముకుంటూ పేద, మధ్య తరగతి వర్గాలను దోచుకున్నారు. ఈ దందాలో ఉన్న ఇద్దరు బీజేపీ నాయకులు ఆ పార్టీ ఓ యువ నాయకుడి ప్రధాన అనుచరులని, ఈ దందాలో అతని సహకారం ముమ్మాటికీ ఉంటుందని జడ్పీటీసీ జీడి భిక్షం పేర్కొన్నారు. ఆ ఇద్దరు నిందితులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి దిగిన ఫొటోలు, స్థానిక నాయకత్వంతో కలిసి ఉన్న ఫ్లెక్సీని విడుదల చేశారు.