భువనేశ్వర్ : పెళ్లిళ్ళు అనగానే ఆహార ప్రియులకు నోరూరుతుంది. ఎందుకంటే రుచికరమైన విందుతో పాటు మాంసాహారం లాగించేయొచ్చు అని. ఎంతో ఆశతో పెళ్లి విందుకు వెళ్లిన వారికి మాంసాహారం వడ్డించకపోతే.. తూ.. ఏం పెళ్లిరా అని తిట్టుకుంటాం. అక్కడున్న వంటకాలు ఆరగించి.. సరిపెట్టుకుంటాం. కానీ ఈ పెళ్లిలో మటన్ వండలేదని ఏకంగా వివాహాన్ని ఆపేశాడు ఓ పెళ్లి కుమారుడు.
ఒడిశాలోని కియోంజార్ జిల్లాకు చెందిన రమాకాంత్ పాత్ర(27)కు ఓ యువతితో వివాహం కుదిరింది. బుధవారం మధ్యాహ్నం పెళ్లి కుమారుడు.. వధువు నివాసమైన సుకిందాకు చేరుకున్నాడు. సంప్రదాయ పద్ధతులతో వరుడిని పెళ్లి వేదిక వద్దకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే వరుడి బంధువులకు విందు ఏర్పాటు చేశారు. విందులో మటన్ లేకపోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు వరుడి బంధువులు. తమకు మటన్ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ విషయం పెళ్లి కుమారుడికి తెలియడంతో.. అతను కూడా ఫైర్ అయ్యాడు. ఈ పెళ్లి తనకు వద్దని చెప్పి అక్కడ్నుంచి బంధువుల నివాసానికి పాత్ర వెళ్లాడు. అదే రోజు రాత్రి మరో అమ్మాయిని పాత్ర వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.