న్యూఢిల్లీ: వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్కు నోటీస్ పంపించింది. సమాచార సంబంధిత గోప్యత, సమాచార భద్రతల విలువలను బలహీనపరచేదిగా వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ఉన్నదని కేంద్రం పేర్కొన్నది.
తాజా నోటీస్పై స్పందించేందుకు వాట్సాప్కు కేంద్రం ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువులోగా స్పందించకపోతే చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. యూరోప్, భారత దేశ యూజర్ల పట్ల వాట్సాప్ వ్యవహరిస్తున్న తీరును పరిశీలించి భారత యూజర్లపై వాట్సాప్ వివక్ష చూపుతున్నట్లుగా భారత ప్రభుత్వం గుర్తించింది.
భారతీయ యూజర్లపై అనుచితమైన నిబంధనలు, షరతులను విధించేందుకు ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకోవడం వాట్సాప్ బాధ్యతారాహిత్యమని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది.