న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించే దిశగా కసరత్తు సాగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికలు జరిగేలోగా గోవా తరహాలో కనీసం ఒక్క డోసు అయినా అర్హులైన నూరు శాతం జనాభాకు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వివరించారు.
యూపీలో యాభై శాతం జనాభాకు తొలి డోసు ఇవ్వగా ఎన్నికలకు ముందు నూరు శాతం మందికి కనీసం వ్యాక్సిన్ తొలి డోసు పూర్తిచేస్తారని చెప్పారు. ఇక ఈనెల 20 కోట్ల కొవిషీల్డ్ డోసులు, 3.5 కోట్ల కొవ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తామని తెలిపారు. అక్టోబర్లో కోటి జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ ప్రస్తుతం కొవిడ్-19 వ్యాక్సిన్ల కొరత లేదని తెలిపారు. అక్టోబర్ తొలి వారానికి దేశ వ్యాప్తంగా వంద కోట్ల టీకాల పంపిణీ మైలురాయికి చేరుకుంటామని అధికారులు పేర్కొన్నారు.