న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ ఇతర సుంకాలతో సమకూరిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెచ్చిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో పేర్కొంది. ఈ రాబడిని ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పధకాలు, కార్యక్రమాలకూ ఈ నిధులను వాడతామని తెలిపింది. మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం కింద 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ కల్పించామని గుర్తుచేసింది.
దేశప్రజలకు ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ చేపడుతున్నామని వివరించింది. పెట్రో సుంకాలతో సమకూరిన రాబడిని మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి కల్పనకూ వెచ్చిస్తామని వెల్లడించింది. ఇక లీటర్ పెట్రోల్పై కేంద్ర ప్రభుత్వం రూ 32.90 ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తుండగా వివిధ సెస్ల పేరిట మరికొంత మొత్తం దండుకుంటోంది. ఇక రాష్ట్రాలూ పెట్రో ఉత్పత్తులపై పన్నులు విధిస్తున్నాయి. కాగా ఇంధన ధరల పెరుగుదల వ్యవహారంలో బీజేపీ సర్కార్ తీరును విపక్షాలు ఎండగడుతున్నాయి. వాహనదారుల జేబులు లూటీ చేయడమే కాకుండా పెట్రో సెగలతో ధరల మంట ఆందోళన రేకెత్తిస్తోందని విపక్షాలు మోదీ సర్కార్పై మండిపడుతున్నారు.