న్యూఢిల్లీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార గరిష్ఠ గడువును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు 60 రోజులు గడువు ఉండగా ఇకపై 45 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరించాలని శుక్రవారం ఆదేశించింది. పార్లమెంట్ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార, పర్యవేక్షణ వ్యవస్థ (CPGRAMS)కు గత ఏడాది ప్రజల నుంచి 22 లక్షల ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అయితే గత ఏడాది వచ్చిన మొత్తం ఫిర్యాదులలో 70 శాతం వరకు ఏడు డిపార్ట్మెంట్లకు చెందినవే. ఆర్థిక సేవల శాఖకు అత్యధికంగా ఐదు లక్షల ఫిర్యాదులు, టెలికాం శాఖకు దాదాపు మూడు లక్షల ఫిర్యాదులు అందాయి. తపాలా శాఖ, కార్మిక మరియు ఉపాధి శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, రైల్వేలు, ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలు గరిష్ఠంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాయి.
కాగా, 2018-2020 మధ్య 8 కేంద్ర ప్రభుత్వ విభాగాలకు 50,000 నుంచి లక్ష ఫిర్యాదులు, నాలుగు డిపార్ట్మెంట్లపై లక్ష నుంచి రెండు లక్షల వరకు, రెండు శాఖలపై రెండు లక్షలకుపైగా ఫిర్యాదులు అందడంపై పార్లమెంట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కార గరిష్ఠ గడువును 60 నుంచి 45 రోజులకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే పనితీరు, ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ర్యాంకులు ఇచ్చేందుకు ప్రభుత్వ సుపరిపాలన సూచిక తరహాలో ‘గ్రీవెన్స్ రిడ్రెసల్ ఇండెక్స్’ ను అభివృద్ధి చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న శాఖలు, విభాగాలను గుర్తించి వాటిని క్రమబద్ధీకరించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు సామాజిక ఆడిట్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది.
పార్లమెంట్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలను సంస్కరించి ఫిర్యాదులను తగ్గించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మంత్రిత్వ శాఖలు, విభాగాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. CPGRAMS ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే లేదా గరిష్ఠంగా 45 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది. కోవిడ్ -19 కేటగిరీలోని ఫిర్యాదులను అధిక ప్రాధాన్యతగా పరిగణించి 3 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. సబ్-జ్యూడీస్ విషయాలు, పాలసీ సమస్యలు, ప్రభుత్వ నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా నిర్దేశిత సమయ వ్యవధిలో పరిష్కారం సాధ్యం కానట్లయితే, ఫిర్యాదుదారులకు ఆ మేరకు మధ్యంతర సమాధానం ఇవ్వాలని కేంద్రం పేర్కొంది.