న్యూఢిల్లీ : కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ లాక్డౌన్, కర్ఫ్యూలు విధిస్తుండటంతో ఆర్థిక రికవరీకి ఆటంకం లేకుండా మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మహమ్మారి కారణంగా జీవనోపాధి దెబ్బతినే వారందరికీ ఊతమిచ్చేలా ఈ ప్యాకేజ్ కు తుదిరూపు ఇవ్వనున్నారు. గత ఏడాది కరోనా కట్టడికి మార్చి 26 నుంచి మే 17 వరకూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో కేంద్ర ప్రభుత్వం పలు ఉపశమన చర్యలతో రూ 20.97 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ ను ప్రకటించింది.
ఇక కొవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంటంతో తాజా ప్యాకేజ్ పై ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలు ప్యాకేజ్ ను ఎప్పుడు ప్రకటించాలి..ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కసరత్తు సాగిస్తున్నాయి. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిక్కీ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్, అసోచామ్ ప్రెసిడెంట్ వినీత్ అగర్వాల్ లతో ఇప్పటికే చర్చలు జరిపారు. ఇక కరోనా కట్టడికి ఈసారి దేశవ్యాప్త లాక్డౌన్ ఉండబోదని, అయితే కఠిన నియంత్రణలు అమలవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.