న్యూఢిల్లీ, జూలై 22: నిఘా, భద్రత సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి ‘సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) రూల్స్-1972’కు చేసిన నిబంధనలను కేంద్రప్రభుత్వం సమర్థించుకొన్నది. దేశానికి నష్టం జరగకుండా నిరోధించేందుకే ఈ సవరణలు చేసినట్టు పార్లమెంటుకు తెలిపింది. ‘నిఘా సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందినవారు సంస్థ, వృత్తి పరమైన విషయాలను బహిర్గతం చేయాలంటే ఆ సంస్థ అధిపతి నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి’ అని కేంద్రం చట్టం చేసింది. ఉల్లంఘిస్తే పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల 100 మందికి పైగా సివిల్ సర్వెంట్లు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడినవారు రహస్యాలను ఎందుకు బహిర్గతం చేస్తారని లేఖలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. భద్రతా సంస్థల్లో పనిచేసిన వారు కొన్ని రహస్యాలను వెల్లడించకుండా నిషేధం ఉంటుందని, వీటిపై ఎక్కడైనా మాట్లాడితే సమస్యలు తలెత్తుతాయని, అందుకే చట్టానికి సవరణలు చేసినట్టు తెలిపారు.