వేసవి నేపథ్యంలో అడవిలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం
జిల్లాలో అడవులను ఆనుకుని అనేక గ్రామాలు
అప్రమత్తతతో ఉండాలంటున్న అధికారులు
తాడ్వాయి, ఏప్రిల్ 1 : ఎండాకాలంలో అడవుల్లో చెలరేగే ఎరగళ్ల మంటలతో అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కష్టపడి సంపాదించిన ఆస్తులు కోల్పోవాల్సి వస్తుంది. ములుగు జిల్లా పూర్తి అటవీ ప్రాంతంలో ఉండగా ఎక్కువ గిరిజన ప్రాంతాలు అడవుల్లోనే ఉన్నాయి. వేసవిలో ఆకురాలి ఉండడంతో మంటలు చెలరేగే అవకాశం ఉంది. ప్రతి ఏటా అడవుల్లో మంటలు వస్తూ అటవీ సంపదతో పాటు గిరిజన గ్రామాల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టినా అవి సఫలం కాకపోవడంతో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఎరగళ్లు ఎలా వస్తాయి..
వేసవిలో అడవుల్లోని చెట్లు ఆకు రాల్చడంతో అడవి మొత్తం ఎండిన ఆకులతో నిండిపోతుంది. పశువుల కాపర్లు చుట్ట, బీడీలు కాల్చుకుంటూ నిప్పు ఆర్పకుండా అలాగే పడేయడంతో ఎరగళ్లు పడే అవకాశం ఉంది. అవి ఎక్కడో అంటుకుని గ్రామాల్లోకి వ్యాపిస్తాయి. ఇళ్ల చుట్టూ ఉన్న చెట్లు ఆకులు రాల్చడంతో మంటలు ఇళ్లకు అంటుకుని అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ఏటా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టే తునికాకు సేకరణ కూడా ఎరగళ్ల మంటలకు కారణమవుతున్నది. ఆకు సేకరణకు నెల రోజుల ముందు సదరు కాంట్రాక్టర్ మోడెం కొట్టిస్తాడు. అనంతరం ఎవరికో ఒకరికి రహస్యంగా అడవిలో మంటలు పెట్టాలని చెప్పడంతో అతడు పెట్టిన మంటలు అడవిని కాల్చిబూడిద చేస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. పాత ఆకులు మంటలకు కాలిపోవడంతో కొత్తగా చిగురించే ఆకు నాణ్యంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. దీని కారణంగానే అడవిలో మంటలు పెడుతారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎరగళ్ల కారణంగా ఇళ్లు కాలిపోవడంతో ఆ కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోతున్నాయి. సంపాదించినదంతా కాలి బూడిదవడంతో నిలువనీడ లేక అల్లాడుతున్నారు.
బూడిదవుతున్న విలువైన అటవీ సంపద
ఎరగళ్ల కారణంగా విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతున్నది. ఔషధ మొక్కలతో పాటు వాటి విత్తనాలు కాలిపోతున్నాయి. దీంతో పాటు జంతువులు గ్రామాల్లోకి వస్తుండటంతో వేటగాళ్లు వాటిని హతమారుస్తున్నారు. అంతేకాకుండా పశువులకు మేత కూడా దొరకడం కష్టతరంగా మారుతుండడంతో కబేళాకు తరలుతున్నాయి.
ఇవి కూడా చుడండి
పిల్లిని ఫూల్ చేసిన పిచ్చుక.. వీడియో వైరల్
మరో ఘనత సాధించిన హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్